ఆరేళ్లలో 187మంది యువతుల ట్రాప్.. రహస్యంగా వీడియోలు.. బయటపడ్డ భారీ రాకెట్..
కోల్కతాకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్లుగా వీరు 187 మంది యువతులను ట్రాప్ చేసినట్టు గుర్తించారు. అంతేకాదు,వారితో ఏకాంతంగా గడిపి.. సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించినట్టు గుర్తించారు. ఆ వీడియోలతో యువతులను వేధిస్తూ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నట్టు నిర్దారించారు. నిందితులు 20 ఏళ్ల వయసు నుంచే ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఎవరా ఇద్దరు :
నిందితుల పేర్లు ఆదిత్య అగర్వాల్,అనీష్ లోహారుకా అని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తులని తెలిపారు. ఆదిత్య కుటుంబం చైన్స్కు సంబంధించిన బిజినెస్ నిర్వహిస్తుంటారని, లోహారుకా కుటుంబం హోటల్ బిజినెస్లో ఉందని తెలిపారు. వీరితో పాటు వీరి వద్ద వంటవాడిగా పనిచేస్తున్న కైలాశ్ యాదవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రాకెట్లో అతని పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు.

ఎప్పుడు మొదలైంది..
అగర్వాల్,లోహారుకా స్కూల్లో చదువుకుంటున్న సమయంలోనే దీనికి తెరలేపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. 17 ఏళ్ల వయసులో వీరిద్దరు తొలిసారిగా 2013లో తమ క్లాస్మేట్ గర్ల్స్ను ట్రాప్ చేసి వీడియోలు చిత్రీకరించినట్టుగా గుర్తించారు. నవంబర్,2019లో తమకు మొదటి ఫిర్యాదు అందినట్టుగా పోలీసులు తెలిపారు. ఆరేళ్ల క్రితం తన బాయ్ఫ్రెండ్ ఆదిత్య అగర్వాల్తో గడిపిన ఫోటోలు తన వాట్సాప్కు వచ్చినట్టు బాధితురాలు ఒకరు తెలిపిందన్నారు. వాటిని చూపించి రూ.10లక్షలు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు చేసిందన్నారు. అయితే ఆమెను బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఉపయోగించిన ఫోన్ నంబర్ వర్చువల్ సిమ్ కార్డుకు చెందినదిగా తేలడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేయలేకపోయారు. దీనిపై ఆదిత్య అగర్వాల్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి అడగ్గా..తనకేమీ తెలియదన్నాడు.

ఎలా చేధించారు..
ఆదిత్య అగర్వాల్పై అనుమానంతో అతని ఫోన్ నంబర్పై నిఘా పెట్టిన పోలీసులకు అనీష్ లోహారుకా నంబర్ దొరికింది. వీరిద్దరి ఫోన్ నంబర్స్పై నిఘా పెట్టగా.. వీరి వద్ద కుక్గా పనిచేస్తున్న కైలాశ్ యాదవ్ను జార్ఖండ్లోని దియోఘర్కి పంపించినట్టుగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు తర్వాత అతన్ని వెంటనే దియోఘర్కి పంపించడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో దియోఘర్కి వెళ్లిన పోలీసులు అక్కడ
కైలాశ్ యాదవ్ ఇంట్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో దాదాపు 182 ఫోల్డర్స్లో వందలాది వీడియోలు ఉన్నట్టుగా గుర్తించారు. అగర్వాల్ గర్ల్ఫ్రెండ్స్,అనీష్ గర్ల్ఫ్రెండ్స్ లేబుల్తో ఆ హార్డ్ డిస్కులో ఫోల్డర్స్ ఉన్నట్టు గుర్తించారు. అందులో పేర్లు,వయసు,చిరునామాతో వంటి వివరాలన్నీ ఉన్నట్టు చెప్పారు.

అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు..
ఆదిత్య అగర్వాల్తో సన్నిహితంగా గడిపిన సమయంలో తాను మైనర్ అని బాధితురాలు వెల్లడించింది. ప్రస్తుతం తాను వివాహిత కావడంతో.. ఇదంతా బయటకొస్తే తనకు ఇబ్బందిగా మారుతుందని,మొదట అతనిపై ఫిర్యాదుకు నిరాకరించింది. కానీ దీని వెనకాల పెద్ద రాకెట్ ఉందని తెలిశాక ఆమె ఫిర్యాదు నమోదు చేసింది. ఆమెతో పాటు మరో ఐదుగురు బాధితులు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 6వరకు వారు రిమాండ్లో ఉండనున్నారు. ఈ కేసులో తమ తరుపున వాదించడానికి నిందితులు ఇప్పటికే 22మంది న్యాయవాదులను పెట్టుకున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications