సీఎం చెప్పినా పట్టించుకోం: టీటీవీ దినకరన్ కు అసెంబ్లీలో స్వాగతం, స్టాలిన్ తో భేటీ!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్ని ఆదేశాలు చేసినా కొందరు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు తమతీరు తమదే, మేము మారం అనే వైఖరితో వ్యవహరిస్తున్నారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద పోటీ చేసి విజయం సాధించిన టీటీవీ దినకరన్ అసెంబ్లీలో అడుగుపెట్టిన సమయంలో ఎవ్వరూ స్పంధించకూడదని, ఆయనతో మాట్లాడకూడదని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు సూచించారు.
చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం అయిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం టీటీవీ దినకరన్ తో జాగ్రత్తగా ఉండాలని, అతనితో మాట్లాడకూడదని, చూసి నవ్వకూడదని చెప్పారు.
సోమవారం అసెంబ్లీలో మొదటి సారి అడుగుపెట్టిన టీటీవీ దినకరన్ ను ఇద్దరు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తూ ఆయన్ను అభినందించి తమిళనాడు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన రతిన సభాపతి, కలై సెల్వన్ టీటీవీ దినకరన్ కు స్వాగతం పలికి ఆయన సీటు దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్, టీటీవీ దినకరన్ అసెంబ్లీలో భేటీ అయ్యి చర్చించారు.