షాక్: మార్కెట్ లో రూ.2,000 నకిలీ నోట్ల కలకలం
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీని అరికట్టడానికి రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2,000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా కొందరు అప్పుడే రూ.2,000 నకిలి నోట్లు తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువచ్చారు.
కర్ణాటకలోని చిక్కమగళూరులోని ఎపీఎంసీ మార్కెట్ లో శనివారం రూ. 2,000 నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. చిక్కమగళూరులోని ఎపీఎంసీ మార్కెట్ లో అశోక్ అనే వ్యక్తి ఉల్లిపాయలు (ఎర్రగడ్డలు) హోల్ సేల్ వ్యాపారం చేస్తున్నాడు.
శనివారం ఉదయం ఆయన టీ తాగడానికి బయటకు వెళ్లారు. అదే సమయంలో అశోక్ దగ్గర పని చేసే యువకులు దుకాణంలో ఉన్నారు. తరువాత అక్కడికి వ్యాపారం చెయ్యడానికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.2,000 నకిలి నోట్లు ఆ యువకులకు ఇచ్చి ఉల్లిపాయలు తీసుకు వెళ్లారు.

తరువాత దుకాణం దగ్గరకు వచ్చిన అశోక్ కు ఆ నోట్లు ఇచ్చారు. రూ.2,000 నోట్లకు చివరిలో కత్తెరతో కత్తిరించిన విషయం గుర్తించిన అశోక్ షాక్ కు గురైనాడు. ఎవరో రూ. 2,000 అసలు నోట్లను కలర్ ప్రింట్ సహాయంతో నకిలి నోట్లు తయారు చేశారని గుర్తించారు.
ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.2,000 నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన రెండు రోజుల్లోనే నకిలి నోట్లు తయారు చెయ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలి నోట్లు తయారు చేసిన వారి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications