శుభవార్త: రెండు మార్గాల్లో 200 కి.మీ. వేగంతో ప్రయాణించే కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: 2017-18 సంవత్సరం పింక్ బుక్లో మరో రెండు పెద్ద ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం జోడించింది. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ హౌరా మార్గాల్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు రూ.18,000 కోట్లు కానున్నాయి. ఈ రైళ్లు గంటకు 200 కిలో మీటర్లు ప్రయాణించనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు దేశంలోని 11 రాష్ట్రాలను కవర్ చేయనున్నాయి.
ఇదిలా ఉండగా, రైల్వే ఛార్జీలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజ్యసభలో రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ, ప్రత్యేక రైళ్లు, వాటి ఛార్జీల గురించి వివరించారు. పండగలు, ప్రత్యేక కార్యక్రమాలు, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. రెండో తరగతి రిజర్వేషన్కు ప్రాథమిక ధరపై 10 శాతం, ఇతర తరగతులకు 30 శాతం వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సువిధ రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. ఈ రైళ్లలో ప్రాథమిక ధర తత్కాల్ టికెట్ ధరతో సమానంగా ఉంటుందని, ప్రతి ఇరవై శాతం సీట్లు నిండేకొద్దీ ధర క్రమంగా పెరుగుతుందన్నారు.
గరిష్ఠంగా తత్కాల్ ధరకు మూడు రెట్ల ఛార్జీని వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఛార్జీలను సవరించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు.. అలాంటి ప్రతిపాదనేదీ లేదని మంత్రి తెలిపారు.