'పన్నీర్ వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు.. సంక్షోభానికి అసలు కారణం వారే'
తమిళనాడు రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.
చెన్నై: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వెలువడుతూనే ఉన్నాయి. తమిళనాడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు వెనుక కేంద్రం ఉందన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభం వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. అయితే వారి పేర్లు మాత్రం ఆయన బయటపెట్టకపోవడం గమనార్హం. సందర్బం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడుతానని ఆయన తెలిపారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన జాప్యాన్ని నిరసిస్తూ మొత్తం వ్యవహారంలో విద్యాసాగర్ రావు కూడా న్యాయబద్దంగా వ్యవహరించలేదని అన్నారు. ఇప్పటికైనా గవర్నర్ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
సాయంత్రం 6గం.ల లోగా పన్నీరు సెల్వం తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితా అందించని పక్షంలో అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.పళనిసామి తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల జాబితాను రాజ్ భవన్ కు అందజేశారని ఆయన తెలిపారు.