ఆసియాలోనే తొలిసారి: పిజ్జా బైక్లు చూసి బైక్ ఆంబులెన్స్లు (ఫోటోలు)
బెంగళూరు: బెంగళూరు నగరంతో పాటు ఇతర నగరాలలో ట్రాఫిక్ రద్ది కారణంగా సరైన సమయంలో అంబులెన్స్ లు గమ్యం చేరుకోలేకపోతున్నాయి. ఈ కారణంగా ప్రమాదాలలో గాయపడిన అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ఈ విధంగా ప్రమాదాలలో గాయపడిన వారికి 10 నిమిషాల వ్యవధిలో చికిత్స చెయ్యడానికి బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. బుధవారం నుండి బెంగళూరు నగరంలో 22 బైక్ ఆంబులెన్స్ లతో పాటు కర్ణాకలోని అనేక నగరాలలో ఈ బైక్ అంబులెన్స్ లు సంచరిస్తాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యు.టి. ఖాదర్ అన్నారు.
ఆసియాలోనే మొదటి సారి అందుబాటులోకి తీసుకు వచ్చిన బైక్ ఆంబులెన్స్ లను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభించారు. బైక్ లు నడపడం మీ పని కాదు సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు చికిత్స అందించాలని సిద్దరామయ్య బైక్ ఆంబులెన్స్ నిర్వహకులకు సూచించారు.
ప్రథమ చికిత్స
ఆసియాలోనే మొదటిసారి ప్రవేశపెట్టిన బైక్ ఆంబులెన్స్ లకు సైరన్ సదుపాయం, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. 220 సీసీ బైక్ ఆంబులెన్స్ విలువ రూ. 2. లక్షల 20 వేలు. 40 రకాల ఔషదాలు బైక్ ఆంబులెన్స్ లో ఉంటాయి. పిజ్జా తరలించే బైక్ లను చూసి ఈ బైక్ ఆంబులెన్స్ లు అందుబాటులోకి తీసుకు వచ్చారు.
ఆక్సిజన్ కిట్ లు
ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిన వెంటనే మెయిన్ రోడ్లలో కాకుండా చిన్నచిన్న గల్లీల మీదుగా సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ఈ బైక్ లలో ఆక్సిజన్ కిట్ లు ఉంటాయి. సంఘటనా స్థలంలో ప్రథమ చికిత్స అందిస్తారు.
బైక్ ఆంబులెన్స్ లు ప్రారంభించిన సిద్దరామయ్య
బైక్ ఆంబులెన్స్ లను సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు. బెంగళూరు నగరంతో పాటు మైసూరు, శివమొగ్గ, మంగళూరు, బెల్గాం, హుబ్బళి-దార్వాడ, కులబర్గి ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందించడానికి బైక్ ఆంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి.
బైక్ నడుపుతారు, చికిత్స చేస్తారు
బైక్ ఆంబులెన్స్ లు నడిపేవారు ప్రమాదాలలో గాయపడిన వారికి చికిత్స అందిస్తారు. అవసరమైతే అక్కడి నుండి బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తారు.
108 నెంబర్ కు ఫోన్ చెయ్యండి
ప్రమాదం జరిగిన వెంటనే 108 నెంబర్ కు ఫోన్ చేస్తే జీపీఎస్ ద్వారా సమీపంలో బైక్ ఆంబులెన్స్ ఎక్కడ ఉందనే విషయాన్ని గుర్తిస్తారు. తరువాత సమాచారం తెలుసున్న బైక్ ఆంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంటారు.