ముంబైలో మరో ఇద్దరు మహిళా పోలీసులకు కరోనా.. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విధులు..
మహారాష్ట్ర ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఇటీవల విధులు నిర్వహించిన ఇద్దరు మహిళా పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో ఒకరు ఏఎస్ఐ కాగా, మరొకరు కానిస్టేబుల్. వీరిద్దరు కేవలం ఒకటి,రెండు రోజులే అక్కడే విధుల్లో ఉన్నారని.. ఆదివారం వీరి శాంపిల్స్ను పరీక్షించడంతో పాజిటివ్గా తేలిందని అధికారులు వెల్లడించారు.
మహిళా పోలీస్ సిబ్బందికి కరోనా సోకడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో ఆరుగురు పోలీస్ సిబ్బందిని క్వారెంటైన్ చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికే 37 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా ముంబైకి చెందినవారే ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే బాంద్రాలోని తన నివాసంలోనే ఉంటూ వారానికోసారి మలబార్ హిల్స్లోని క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.

ఇదే ప్రాంతంలో పలువురు మంత్రుల అధికారిక నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీస్ సిబ్బంది నుంచి స్వాబ్ శాంపిల్స్ను సేకరించి టెస్టుల కోసం పంపించారు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా సోకిన పోలీసులకు రూ.1లక్ష సాయం అందించనున్నట్టు ఇదివరకే ప్రకటించింది. పోలీసు సిబ్బందిలో ఎవరైనా కరోనా బారిన పడితే.. తక్షణమే పోలీస్ సంక్షేమ నిధి నుంచి వారికి రూ. 1 లక్ష అడ్వాన్స్ జమ చేయాలని యూనిట్ కమాండర్లను ఆదేశించారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలకు చేరువలో ఉంది. మంగళవారం(ఏప్రిల్ 22) నాటికి దేశంలో 19,165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే 4,666 కేసులు నమోదవగా.. 572 మంది కోలుకున్నారు. 232 మంది మృతి చెందారు. ఢిల్లీలో 2081 కేసులు,గుజరాత్లో 2066 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications