బెంగళూరులో రెండు ఫ్యామిలీల గొడవ: కాలుతో బాలుడి గొంతు తొక్కి చంపేశాడు!
బెంగళూరు: చిన్న విషయంలో రెండు కుటుంభాల సభ్యులు గొడవ పడటంతో రెండేళ్ల చిన్నారి హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని సోలదేవనహళ్లిలో నివాసం ఉంటున్న వెంకటేష్ (2) అనే బాలుడు హత్యకు గురైనాడు.
సోలదేవనహళ్ళిలో బసవరాజు, వెంకమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బసవరాజు, వెంకమ్మ దంపతుల కుమారుడు వెంకటేష్. బసవరాజు ఇంటి పక్కనే ఈరన్న అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం బసవరాజు, ఈరన్న కుటుంబ సభ్యుల మధ్య చిన్నగొడవ జరిగింది.
కుక్కకు పాలు పోసే విషయంలో బసవరాజు, ఈరన్న కుటుంబ సభ్యులు గొడవ పడటంతో స్థానికులు సర్ది చెప్పారు. ఈ విషయంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని బసవరాజు, ఈరన్న కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి గొడవ పెద్దది కాకుండా చేశారు.
ఈ విషంపై కక్ష పెంచుకున్న ఈరన్న బుధవారం సాయంత్రం ఎవ్వరూ లేని సమయంలో ఇంటిలో నిద్రపోతున్న వెంకటేష్ గొంతు మీద కాలు పెట్టి తొక్కి చంపేశాడని బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరన్న మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని గురువారం పోలీసులు తెలిపారు.