సర్వే: ప్రధానిగా మోడీ భేష్.. మళ్లీ కావాలి, చివరి ర్యాంకుల్లో దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలన సంతృప్తికరంగా ఉందా? రెండేళ్ల ఆయన పని తీరు బాగుందా? అనే ప్రశ్నలకు 62 శాతం మంది అవును అని సమాధానం చెప్పారు. ఈ విషయం సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
రెండేళ్ల పాలనలోను ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రతిష్ట చెదరలేదు. ప్రధానిగా ఆయన పనితీరును పెద్దసంఖ్య (62శాతం)లో ఆమోదించినట్లుగా తాజా సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా మోడీయే ప్రధానిగా కొనసాగాలని 70 శాతం మంది కోరుకున్నారు.
తమ జీవన ప్రమాణాల్లో మార్పేమీ లేదని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగంమంది (49 శాతం) చెప్పగా, పరిస్థితి మరింత దిగజారిందని 15 శాతం మంది పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో పేద ప్రజలు ప్రయోజనం పొందడం లేదని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రధాని తన హామీలను నెరవేర్చారని మూడింట ఒకటో వంతుకన్నా తక్కువమంది భావిస్తుండగా, హామీలు పాక్షికంగానే నెరవేరాయని సుమారు 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కాశ్యప్ సర్వే ఫలితాలను వెల్లడించారు.
ప్రధాని వ్యక్తిగత ప్రతిష్ఠ ఇప్పటికీ బాగా ఉందనీ, ఆయన పనితీరును ఎక్కువమందే ఇష్టపడుతున్నారని సుభాష్ తెలిపారు. ప్రపంచస్థాయిలో భారత్ స్థానాన్నీ, దేశీయంగా పాలనను మెరుగుపరిచే విషయాల్లో మోడీ చేసిన కృషికి అత్యధికులు సంతృప్తి చెందారన్నారు.
సర్వే ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాల్లో ద్రవ్యోల్బణమేనని 32 శాతం మంది పేర్కొనగా, ఉద్యోగిత కల్పించడంలో అశక్తతను 29 శాతం మంది, నల్లధనం వెనక్కి తేవడంలో అసమర్థతను 26 శాతం మంది ఎత్తి చూపారు.
ప్రభుత్వ భారీ విజయాల్లో జన్ ధన్ యోజనను 36 శాతం మంది, స్వచ్ఛభారత్ అభియాన్ను 32 శాతం మంది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడంలో కృషిని 23 శాతం మంది ప్రశంసించారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు.
కేంద్ర మంత్రిత్వశాఖల్లో రైల్వేశాఖ ఉత్తమ ఫలితాలు నమోదు చేసింది. అంతగా ఫలితాలు కనబరచని మంత్రిత్వ శాఖల్లో కార్మిక, ఉపాధి కల్పన, న్యాయ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలున్నాయి.
కేంద్రమంత్రుల్లో సుష్మాస్వరాజ్ తొలిర్యాంకులో ఉండగా, అత్యల్ప ర్యాంకులు సాధించిన మంత్రుల్లో రాం విలాస్ పాశ్వాన్, బండారు దత్తాత్రేయ, జేపీ నడ్డా, రాధా మోహన్ సింగ్లు ఉన్నారు. వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీ వంటి ముఖ్యమైన మంత్రులు యావరేజీగా నిలిచినట్లు తేలింది.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ 15వ స్థానంలో ఉన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మొదటి స్థానంలో ఉన్నారు.
మోడీ పనితీరుకు సంబంధించి 5 మార్కుల స్కేలుపై అభిప్రాయాలు సేకరిస్తే.. 30 శాతం మంది 5 మార్కులు, 32 శాతం మంది 4 మార్కులు, 20 శాతం 3 మార్కులు, 7 శాతం ఒక్క మార్కు ఇచ్చారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం మోడీ ప్రధానిగా ఉండాలని 70 శాతం మంది కోరుకున్నారు. 30 శాతం మంది మాత్రం కొత్త వ్యక్తులను చూడాలనుకున్నారు.