వారు ఇలాగే, కానీ ఒక్కసారి మినహాయించండి: కేరళపై మోడీకి కేంద్రమంత్రి
Recommended Video
తిరువనంతపురం: కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ గురువారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) కేరళకు రూ.700 కోట్లను ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రం తిరస్కరించింది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా విదేశాల నుంచి విరాళాలకు నో చెప్పింది.
ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధనలను పక్కన పెట్టి, ఈ ఒక్కసారికి కేరళకు యూఏఈ సాయం చేసేందుకు అంగీకరించాలని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు కూడా ఇలాగే విదేశీ సహాయాన్ని నిరాకరించాయని, దానినే ఇప్పుడు తమ ప్రభుత్వం అనుసరించిందని ఆయన అన్నారు.
2004లో సునామీ, ఆ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విదేశీ సహాయాన్ని తిరస్కరించిందని గుర్తు చేశారు. దానినే కేంద్రం ఇప్పుడు కేరళ విషయంలో అనుసరిస్తోందన్నారు. అదే సమయంలో ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్కసారికి యూఏఈ ప్రభుత్వం సహకారాన్ని అంగీకరించాలన్నారు.
గత యాభై ఏళ్లలో మనం చెల్లించిన విదేశీ మారకద్రవ్యంలో ఎక్కువ భాగం కేరళ నుంచే వచ్చిందని, గత ఏడాది 75,000 కోట్లు వచ్చిందని, అలాగే దేశంలో కేరళ అతిపెద్ద పర్యాటక ప్రాంతమని, దీని ద్వారా పెద్ద మొత్తం వస్తోందని, నేను నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో కేరళను ప్రత్యేకంగా పరిగణించి, ఈ ఒక్కసారి మినహాయింపు ఇచ్చి, యూఏఈ మొత్తాన్ని ఆమోదించాలన్నారు.
కేరళతో యూఏఈకి ప్రత్యేక అనుబంధం కాబట్టి నిధులు తీసుకోవాలి
యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకృతి విపత్తుల సమయంలో విదేశీ సాయాన్ని తీసుకోలేదని అయితే అనంతరం పునరావాస కార్యక్రమాల కోసం మాత్రం విదేశాల సాయాన్ని తీసుకున్నట్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు తెలిపారు. పునరావాస కార్యక్రమాలను సంబంధించి నిధులు స్వీకరించడంలో ఎలాంటి అడ్డంకులు లేవన్నారు.
గల్ఫ్ దేశాలతో కేరళకు ప్రత్యేకమైన అనుబంధముందని ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి వచ్చే సాయాన్ని తీసుకోకపోవడంలో అర్థం లేదని సంజయ్ బారు అన్నారు. తద్వారా ఆ దేశాలతో ప్రత్యేక సంబంధం ఉందని తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. యూఏఈలో దాదాపు 30 లక్షల వరకు భారతీయులు ఉన్నారు. వీరిలో అత్యధికులు కేరళకు చెందినవారు.