ఢిల్లీ క్యాబ్ రేప్: హైదరాబాద్లోనూ బ్యాన్, విస్తృత తనిఖీలు
హైదరాబాద్: మహిళా ఎగ్జిక్యూటివ్పై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ ఉబేర్ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ సంస్థకు ఏ విధమైన అనుమతి లేదని, అందువల్ల క్యాబ్ యజమానులూ డ్రైవర్లూ ఆ సంస్థకు దూరంగా ఉండాలని హైదరాబాద్ రవాణా కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రత కారణంగా వెబ్ సంబంధిత టాక్సీ సర్వీసులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు.
ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాదులో విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి హైదరాబాదు రహదారులపై క్యాబ్లను రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఎ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పత్రాలున్నాయా, లేదా అనేది విషయాన్ని ధ్రువీకరించుకుంటున్నారు. ఉబేర్ కార్యకలాపాలను ఢిల్లీలో నిషేధించిన విషయం తెలిసిందే.
శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్లోక్లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్లో పనిచేస్తోంది.
మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.