ఉద్ధవ్ భావోద్వేగం: కూటమి అధినేతగా, సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవం: కొత్త పేరు పెట్టిన నేతలు
ముంబై: ఊహించినట్టుగానే శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధి నాయకుడిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ముంబైలోని హోటల్ ట్రైడెంట్ లో కొనసాగుతోన్న కూటమి నాయకుల సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానానికి ఆమోదం లభించింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆయన పేరును ప్రతిపాదించగా.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానిని బలపరిచారు. ఏకవాక్య తీర్మానం రూపంలో ఉద్ధవ్ థాకరే పేరును ఆమోదించారు.
డిసెంబర్ 1న ఉద్ధవ్ ప్రమాణం: థాకరే కుటుంబం నుంచి తొలి నేతగా.. !
కూటమికి కొత్త పేరు.. మహా వికాస్ అఘాడి
శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి సరికొత్త పేరును పెట్టారు. `మహా వికాస్ అఘాడి అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించారు. దీనితో పాటు పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని కూటమి నాయకులు వెల్లడించారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చినందున.. దీనిపై ఎలాంటి చర్చలు లేవని తెలిపారు.
భావోద్వేగానికి గురైన ఉద్ధవ్
మహా వికాస్ అఘాడి నేతగా, ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా తన పేరును ఏకగ్రీవంగా ఆమోదించిన వెంటనే ఉద్దవ్ థాకరే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ ఉద్వేగంతోనే ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠిస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. భారతీయ జనతా పార్టీతో 30 సంవత్సరాల పాటు కొనసాగిన మైత్రీ బంధాన్ని ఎందుకు తెంచుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు.
మూడు దశాబ్దాలుగా కలిసే ఉన్నా..
మూడు దశాబ్దాలుగా తాము కలిసే ఉన్నప్పటికీ..రెండున్నరేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి బీజేపీ ససేమిరా చెప్పడం కలచి వేసిందని, బాధ కలిగించిందని అన్నారు. మిత్ర ద్రోహానికి పాల్పడిందని అన్నారు. ఆ కారణంతోనే- తాము బీజేపీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. భావ సారూప్యం ఉన్నప్పటికీ.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, సుస్థిర ప్రభుత్వాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో తాము ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలవాల్సి వచ్చిందని ఉద్ధవ్ థాకరే వివరించారు. సుస్థిర ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తామని చెప్పారు.
ఒంటరిని కాను.. శరద్ పవార్ తో కలిసి అద్భుతాలు
బీజేపీని వీడిన తరువాత శివసేన ఒంటరి అయిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని చెప్పారు. తాను గానీ, తన పార్టీ గానీ ఒంటరి కాదని చెప్పారు. సోనియాగాంధీ, శరద్ పవార్ వంటి రాజకీయ అనుభవజ్ఞులు తమ వెంట ఉన్నారని అన్నారు. వారి సలహాలు, సూచనలతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తానని వెల్లడించారు. బీజేపీతో కలిసి ఉండటం కంటే ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తనకు ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.