క్రిస్మస్ పై కరోనా స్ట్రైయిన్ ఎఫెక్ట్ : ప్రార్థనలకు 50 మంది మాత్రమే అనుమతి.. !
ముంబై: క్రిస్మస్ వేడుకలకు సమయం దగ్గర పడుతున్న వేళ మహారాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. సాధారణంగా క్రిస్మస్ కంటే ముందురోజు నుంచే చాలా చోట్ల ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అయితే ఇలాంటి ప్రార్థనా సమావేశాలకు 50 మంది కంటే ఎక్కువగా ఉండరాదని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రవేశించిన నేపథ్యంలో అది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ చెప్పారు. ఈ క్రమంలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.
క్రిస్మస్ పై కరోనా వైరస్ స్ట్రెయిన్ ఎఫెక్టర్
కరోనా కొత్త రకం వైరస్ విస్తరిస్తున్న వేళ ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించిన రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులు ప్రార్థనల సందర్భంగా పలు కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరారు. ప్రార్థనలకు 50 మంది కంటే ఎక్కువగా ఉండరాదని సూచించిన మహా సర్కార్... భౌతికదూరం తప్పక పాటించాలని పేర్కొంది.శానిటైజేషన్ తప్పనిసరి అని వెల్లడించింది. కోవిడ్ గైడ్లైన్స్ను పాటిస్తూ పండగను సంతోషంగా జరుపుకోవాలని అదే సమయంలో పెద్దఎత్తున జరిగే వేడుకలపై కాస్త నియంత్రణ పాటించాలని కోరారు. 60 ఏళ్లకు పైబడి ఉన్న వ్యక్తులు, 10 ఏళ్లలోపు పిల్లలను ప్రార్థనా ఆలయంలోకి రాకపోవడమే మంచిదని మంత్రి పేర్కొన్నారు.
క్రిస్మస్ మాస్ అర్థరాత్రి కాకుండా..
ఇక చర్చ పరిసర ప్రాంతాలను అప్పుడప్పుడు శానిటైజ్ చేస్తుండాలని, అదే సమయంలో చర్చిలోపల భౌతిక దూరం పాటించాలని వెల్లడించింది. చర్చి బయట దుకాణాలు అనేవి ఉండకూదని గైడ్లైన్స్లో పేర్కొంది. ఇక డిసెంబర్ 31న జరిగే థ్యాంక్స్ గివింగ్ మాస్ అర్థరాత్రికి బదులు సాయంత్రం 7:30 గంటలకే నిర్వహించుకోవాలని సూచించింది. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర వేడుకలు, బాణాసంచాలను నిషేధించాలని కోరింది. గుంపులను నివారించే క్రమంలో ఆన్లైన్ ద్వారా ప్రార్థనా సమావేశాలను నిర్వహిస్తే బాగుంటుందని సూచించింది.
ప్రభుత్వం ఆదేశాలతో అసంతృప్తితో చర్చి సంఘాలు
ప్రభుత్వం ఉన్నఫలంగా ఆదేశాలు జారీ చేయడంతో పలు చర్చి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటికిప్పుడు చెబితే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక మాస్ టైమింగ్స్ను మార్చుతున్నట్లు వెల్లడించాయి. 100 మందితో మాత్రమే ప్రార్థన నిర్వహించుకోవచ్చని గతవారం సర్క్యులర్ పంపడంతో అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నామని.. ఇప్పుడు ఆ సంఖ్యను సగంకు తగ్గించాలని చెబుతుండటం బాధాకరమని చర్చి సంఘాలు చెప్పాయి. ఇప్పటికే 100 మంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని వారిని రావొద్దని ఎలా చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కొత్త గైడ్లైన్స్ను ఫాలో అవుతామన్నారు చర్చి ఫాదర్లు.