మహా సంక్షోభం: సీఎం నివాసం ఖాళీ చేసి మాతోశ్రీకి చేరిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించిన గంటల వ్యవధిలోనే సీఎం నివాసాన్ని వీడారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే. బుధవారం రాత్రి తన సామాగ్రితోపాటు ఉద్ధవ్ థాక్రే, ఆయన సతీమణి, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా తిరిగి తమ నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు.
#WATCH Maharashtra minister & Shiv Sena leader Aaditya Thackeray shows victory sign on reaching 'Matoshree'#Mumbai pic.twitter.com/FtS3QOEJAY
— ANI (@ANI) June 22, 2022
ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. భారీగా చేరుకున్న శివసేన కార్యకర్తలు, నేతలు ఉద్దవ్ థాక్రేకు మద్దుతగా నినాదాలు చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే అనుచరులకు అభివాదం చేస్తూ అక్కడ్నుంచి కదిలారు. ఇది ఇలావుండగా, శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే క్యాంపునకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడం గమనార్హం. దీంతో షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య 40కిపైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏక్నాథ్ను సీఎం చేయండి: థాక్రేకు సూచించిన శరద్ పవర్
శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం ముంగిట పడింది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, రాజీనామా లేఖ కూడా రెడీగా ఉందని ఇప్పటికే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. ఏక్ నాథ్ షిండే తోపాటు 34 మంది శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు అనంతరం ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Luggage being moved out from Versha Bungalow of Maharashtra CM Uddhav Thackeray in Mumbai pic.twitter.com/CrEFz729s9
— ANI (@ANI) June 22, 2022
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ బుధవారం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. అంతేగాక, తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయమని సలహా ఇచ్చారని రాజకీయ వర్గాలు తెలిపాయి. పవార్తో పాటు ఆయన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ మంత్రి జితేంద్ర అవద్తో కలిసి దాదాపు గంటపాటు సమావేశం జరిగింది.
రాజీనామాకు సిద్ధమని చెప్పిన సీఎం ఉద్ధవ్ థాక్రే
ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన నిమిషాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలకు ఆలివ్ శాఖను విస్తరింపజేసిన థాక్రే.. తన తర్వాత ఒక శివసైనికుడు ముఖ్యమంత్రిగా వస్తే తాను సంతోషిస్తానని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. తాను సొంత మనుషులు అనుకున్నవాళ్లు ఇప్పుడు తనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఏక్నాథ్ షిండే సహా ఎవరైనా నన్ను సీఎంగా వద్దు అని చెబితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అధికారిక నివాసాన్ని వదిలివేస్తానని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని ఆయ తెలిపారు.
కానీ, నా మనుషులు (ఎమ్మెల్యేలు) నన్ను కోరుకోనప్పుడు నేను ఏమి చెప్పగలను. వారికి నాపై ఏదైనా వ్యతిరేకత ఉంటే, సూరత్లో ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది, వారు ఇక్కడికి వచ్చి నా ముఖం మీదే చెబితే బాగుండేది అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోవాలంటే రాజీనామా చేస్తా.. శివసేన నుంచి వేరే ఎవరినైనా సీఎం చేయవచ్చు అని అన్నారు. తనకు వ్యతిరకంగా తన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా.. అది తనకు అవమానమేనని అన్నారు.
#WATCH NCP leader Supriya Sule shows thumbs up after meeting with Maharashtra CM Uddhav Thackeray in Mumbai. The meeting between NCP's Sharad Pawar and CM Thackeray lasted around an hour. #Mumbai pic.twitter.com/3LGjf279M9
— ANI (@ANI) June 22, 2022
బాలా సాహేబ్కు తామే అసలైన వారసులమని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. శివసేన హిందుత్వానికి ఎప్పుడూ దూరం కాలేదని చెప్పారు. శివసేన హిందూమతం కలిసే ఉంటాయన్నారు. 'మా ఊపిరిలో హిందుత్వ ఉంది. హిందుత్వానికి ఎవరు ఏం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు' అని ఉద్ధవ్ థాకరే అన్నారు, "నేను బాలాసాహెబ్ హిందుత్వను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను." అని చెప్పారు. తాము గత 30 ఏళ్లుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించామని, కానీ, ఇప్పుడు ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలున్నాయన్నారు. ఇప్పుడున్నది సరికొత్త శిసేన అని అన్నారు.
'నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడు నేను సీఎం కాకూడదని కాంగ్రెస్, ఎన్సిపి చెబితే అది వేరు, కానీ ఈ రోజు, కమల్ నాథ్ కూడా నేను సీఎం కావాలని చెప్పారు. కానీ నా స్వంత వ్యక్తులు (ఎమ్మెల్యేలు) నన్ను కోరుకోనప్పుడు, నేను ఏమి చెప్పగలను? అని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. 'కొందరు ఎమ్మెల్యేలు తిరిగి వస్తామని మాకు ఫోన్ చేస్తున్నారు' అని ఉద్ధవ్ థాక్రే అన్నారు. కాగా, ఏక్ నాథ్ షిండే సహా 34 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంలో క్యాంపు రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. క్యాంపు ఎమ్మెల్యేలంతా తమ నేత షిండేనే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.