ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది: సుప్రీంకోర్టుకు ఏక్నాథ్ షిండే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజార్టీని కోల్పోయిందని శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి 55 మంది 38 మంది ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసహరించుకున్నారని తెలిపారు.
రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ అంగీకరించకపోవడాన్ని కూడా షిండే వర్గం సవాల్ చేసింది. చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా డిప్యూటీ స్పీకర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.
మెజార్టీ కోల్పోయిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు డిప్యూటీ స్పీకర్ ప్రయత్నిస్తున్నారని షిండే వర్గం మండిపడింది. కాగా, ఏక్ నాథ్ షిండేతోపాటు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ మహారాష్ట్ర లెజిస్లేచర్ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 27 సాయంత్రంలోగా దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు.
కాగా, ఏక్ నాథ్ షిండే క్యాంపులో 50 మంది వరకు రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తామే అసలైన శివసేన అని వారు పేర్కొంటున్నారు. అంతేగాక, డిప్యూటీ స్పీకర్ చర్యలు తమపై వర్తించవని అంటున్నారు. తాము ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని, ఈ ప్రభుత్వం ఇప్పుడు మెజార్టీ కోల్పోయిందని చెబుతున్నారు. అంతేగాక, ప్రభుత్వంపై అవిశ్వాసం కోరుతున్నారు.