బుర్కా వేసుకుని ఎస్కేప్ అయిన రమ్యా శెట్టి, వెంటాడిన పోలీసులు, ఆలయం ముందు కారు!
బెంగళూరు: ఉడిపిలోని అష్టమఠాల్లో ఒకటైన శిరూరు మఠం శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసు విచారణ ఎదుర్కొంటున్న రమ్యా శెట్టి బుర్కా వేసుకుని పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి అడ్డంగా చిక్కిపోయింది. రమ్యా శెట్టితో పాటు ఐదు మంది మహిళలను అదుపులోకి తీసుకున్న ఉడిపి పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు.

రమ్యా శెట్టి విచారణ
శిరూరు మఠం శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసులో బ్రహ్మావర ప్రాంతంలో నివాసం ఉంటున్న రమ్యా శెట్టి అనే మహిళను పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రతి రోజూ రమ్యా శెట్టిని విచారణ చేస్తున్న పోలీసులు రాత్రి ఆమెను ఇంటికి పంపిస్తున్నారు.

బుర్కాతో ఎస్కేప్
రమ్యా శెట్టి బుర్కా వేసుకుని ఐదు మంది మహిళలతో కలిసి కారులో పారిపోవడానికి ప్రయత్నించింది. బెళ్తంగడి తాలుకా అళదంగడిలోని శ్రీ సత్యదేవత దేవాలయం ముందు రమ్యా శెట్టి వెలుతున్న మారుతి కారు టైర్ పంచర్ అయ్యింది.

అనుమానం వచ్చింది
శ్రీ సత్యదేవత దేవాలయం సమీపంలోని గ్యారేజ్ దగ్గర కారు టైర్ కు పంచర్ వేస్తున్న సమయంలో రమ్యా శెట్టి సాటి మహిళలతో కలిసి రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఆ సమయంలో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రమ్యాను వెంటాడిన పోలీసులు
ఉడిపి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వేణూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వేణూరు పోలీసులు రమ్యా శెట్టి వెలుతున్న కారును వెంబడించి ఆమెతో పాటు కారులో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకుని ఉడిపి పోలీసులకు అప్పగించారు.

భయం ఎందుకు ?
శిరూరు మఠం శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ అనుమానాస్పద మృతి కేసుతో ఎలాంటి సంబంధం లేకపోతే రమ్యా శెట్టి ఎందుకు బుర్కా వేసుకుని పారిపోవడానికి ప్రయత్నించింది ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రమ్యా శెట్టి పారిపోకుండా ఆమెను రహస్య ప్రాంతంలో ఉడిపి పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications