UGC guidelines : అడ్మిషన్లు,అకడమిక్ ఇయర్,పరీక్షలపై యూజీసీ గైడ్ లైన్స్ ఇవే..
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్టంభనలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ తెరదించింది. లాక్ డౌన్ కారణంగా ఎదురైన సవాళ్లన్నింటికీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకొచ్చింది. పరీక్షల నిర్వహణ మొదలు కొత్త అకడమిక్ ఇయర్పై స్పష్టతనిచ్చింది. దీంతో విద్యార్థులు,కాలేజీ యాజమాన్యాల్లో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.
కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు..?
దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ స్పష్టం చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని.. సెకండియర్,థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కు అగస్టు 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో టెర్మినల్ సెమిస్టర్(చివరి సెమిస్టర్) పరీక్షలు జులై 1 నుంచి జులై 15 వరకు జరుగుతాయని చెప్పింది. ఇంటర్మీడియట్ సెమిస్టర్ పరీక్షలు జులై 16 నుంచి జులై 31 వరకు జరుగుతాయని చెప్పింది. టెర్మినల్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు జులై 31న,ఇంటర్మీడియట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు అగస్టు 8న వెలువడుతాయని తెలిపింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఈ ప్రణాళికలు రూపొందించింది.
అడ్మిషన్ల ప్రక్రియ, పీహెచ్డీ విద్యార్థుల గడువు..
అగస్టు 1వ తేదీ నుంచి అగస్టు 31 వరకు కొత్త అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుందని యూజీసీ స్పష్టం చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో మొదటి బ్యాచ్(ఫస్ట్ సెమిస్టర్) క్లాసులు సెప్టెంబర్ 1న ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే సెకండియర్,థర్డ్ ఇయర్ విద్యార్థులకు అగస్టు 1వ తేదీ నుంచే క్లాసులు మొదలవుతాయని తెలిపింది. జనవరి 1,2021 నుంచి జనవరి 25,2021 వరకు పరీక్షలు నిర్వహించబడుతాయని స్పష్టం చేసింది.ఎంఫిల్,పీహెచ్డీ స్టూడెంట్స్కు మరో ఆరు నెలల గడువును పొడగించింది. వైవా-వాయిస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని యూనివర్సిటీలకు సూచించింది. ఇకనుంచి అన్ని యూనివర్సిటీలు వారానికి ఆరు రోజులు తరగతులు నిర్వహించాలని సూచించింది. అలాగే లాక్ డౌన్ పీరియడ్లో విద్యార్థులు,స్టాఫ్ ట్రావెల్ హిస్టరీ లేదా వారు ఎక్కడ బస చేశారో ఆ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పింది.
ప్రతీ యూనివర్సిటీలో కోవిడ్-19 విభాగం..
ఇంటర్మీడియట్ సెమిస్టర్ విద్యార్థులకు ప్రస్తుత మరియు గత ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పింది. కరోనా ప్రభావం అంతగా లేని,సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాల్లో మాత్రం జులైలో పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక టెర్మినల్ సెమిస్టర్ (చివరి సెమిస్టర్) పరీక్షలు జులై నెలలో ఉంటాయని తెలిపింది. ప్రతీ యూనివర్సిటీలోనూ ఒక కోవిడ్-19 విభాగం ఏర్పాటు చేయబడుతుందని.. దాని ద్వారా విద్యార్థుల పరీక్షలు,అకడమిక్ క్యాలెండర్కు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడుతాయని చెప్పింది.
పరీక్షలు వీలైనంత త్వరగా,సరళతరంగా...
యూజీసీ మార్గదర్శకాలు,కోవిడ్-19 సమస్యలను పరిగణలోకి తీసుకుని వర్సిటీలు సొంత ప్రణాళికలు కూడా రూపొందించుకోవచ్చునని వెల్లడించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్,వైవా-వాయిస్ పరీక్షలను స్కైప్ లేదా ఇతరత్రా ఆన్లైన్ యాప్స్ ద్వారా నిర్వహించాలని సూచించింది. ఇంటర్మీడియట్ సెమిస్టర్లకు సంబంధించి.. తరువాతి సెమిస్టర్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించవచ్చు నని తెలిపింది. పరీక్షలను సరళంగా,త్వరగా పూర్తి చేయడానికి వర్సిటీలు ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించవచ్చునని తెలిపింది. పరీక్షల సమయాన్ని 3గంటల నుంచి 2గంటలకు తగ్గించడం.. డిస్క్రిప్టివ్ విధానంలో కాకుండా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు చేపట్టడం వంటివి చేయవచ్చునని సూచించింది.