విద్యార్థులకు గుడ్న్యూస్: ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ అనుమతి
న్యూఢిల్లీ: విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శుభవార్త అందించింది. ఏకకాలంలో రెండు డిగ్రీలను కొనసాగించడానికి విద్యార్థులకు యుజీసీ అనుమతినిచ్చింది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ మంగళవారం ప్రకటించారు. డిగ్రీలను ఒకే విశ్వవిద్యాలయంలో లేదా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కూడా పొందవచ్చని స్పష్టం చేశారు.
భౌతిక తరగతులు లేదా ఆన్లైన్లోనూ డిగ్రీలను చదవడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి యూజీసీ త్వరలో వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయనుందని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు బహుళ నైపుణ్యాలను పొందేందుకు వీలుగా ఒక అభ్యర్థి ఒకేసారి రెండు డిగ్రీలను చదవడానికి వీలుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు యూజీసీ ఛైర్మన్.

వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి కూడా డిగ్రీలు చదువుకునే వీలుగా నిబంధనలను తయారు చేస్తామని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వివరించారు. మరోవైపు, యూనివర్సిటీ క్యాంపస్లలో హింసను నివారించాలని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఇద్దరు విద్యార్థుల బృందాల మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలోని కావేరీ హాస్టల్లో రామనవమి నాడు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణలతో హింస చెలరేగింది. ఘర్షణలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఇంతకుముందు విద్యార్థులు భారతదేశంలో ఒకే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ను కొనసాగించడానికి మాత్రమే అనుమతించబడ్డారు. యూజీసీ తాజా నిర్ణయం విద్యార్థులకు ఒకే లేదా ఇతర ఇన్స్టిట్యూట్లలో వివిధ ఫ్యాకల్టీల నుంచి బహుళ సబ్జెక్టులను అధ్యయనం చేసే అవకాశాన్ని అందిస్తుంది.












Click it and Unblock the Notifications