మోడీని కలవలేకపోయానని.. ప్రయాణికులుండగానే బస్సుకు నిప్పుపెట్టింది!
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవలేకపోయానన్న అసహనంతో ఓ మహిళ.. ఏకంగా ప్రయాణికుల బస్సుకు నిప్పుపెట్టింది. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో చోటుచేసుకుంది.
సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?
మోడీని కలిసేందుకు ప్రయత్నించి..
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానిని కలిసేందుకు వందన రఘువన్షీ అనే మహిళ ప్రయత్నించింది.
మోడీని కలవలేదనే అసహనంతో ప్రయాణికులున్న బస్సుకు నిప్పు
అయితే ప్రధానితోపాటు యూపీ ఎం యోగిని కలవడం ఆమెకు వీలు పడలేదు. దీంతో అసహనానికి గురైన వందన.. బుధవారం ఓ బస్సుపై దాడి చేసింది. కంటోన్మెంట్ బస్ స్టేషన్ నుంచి లక్నో వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.
పెను ప్రమాదం తప్పింది..
గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
పూర్వాంచల్ కోసం ఆమరణ దీక్ష..
కాగా, గత కొంతకాలంగా వందన ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రం కోసం పోరాడుతోంది. ఉత్తర్ప్రదేశ్ నుంచి పూర్వాంచల్ను విభజించి ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 15న ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగస్టు 29ను వందన చేత బలవంతంగా దీక్ష విరమింపజేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా బస్సుకు నిప్పుపెట్టడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.