మాంత్రికుడు చెప్పాడని... సంతానం కలిగేందుకు... మూడేళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన వివాహిత..
ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగుచూసింది. నరబలి ఇస్తే సంతానం కలుగుతుందన్న ఓ మాంత్రికుడి మాటలు నమ్మి ఓ వివాహిత కిరాతక చర్యకు ఒడిగట్టింది. తమ పొరుగింట్లో ఉండే మూడేళ్ల బాబును నరబలి ఇచ్చింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాల మత్తులో దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటనలు పౌర సమాజంలో ఆందోళన రేకెత్తించే అంశం. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె,కేరళలోని పాలక్కడ్ జిల్లాలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీకి చెందిన నీలం గుప్తా(25)కు 2013లో వివాహం జరిగింది. పెళ్లయి దాదాపు 8 ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో అత్తింటివారు తరచూ సూటి పోటి మాటలతో ఆమెను వేధిస్తున్నారు. పిల్లల కోసం ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. అత్తింటి వేధింపులతో తీవ్రంగా సతమతమైన ఆమె తెలిసినవారి సాయంతో ఒక మాంత్రికుడిని కలిసింది. ఆ మాంత్రికుడు సంతానం కలగాలంటే నరబలి ద్వారా దేవుళ్లకు శాంతి చేయాలని చెప్పాడు.
శవాన్ని బ్యాగులో కుక్కి...
మాంత్రికుడి మాటలు నిజమేనని నమ్మిన మహిళ తమ పొరుగింట్లో ఉండే మూడేళ్ల బాబును నరబలి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 20) తమఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాబును మాయ మాటలతో ఆకర్షించింది. ఆపై ఇంటికి తీసుకెళ్లి రాత్రి పూట నరబలి ఇచ్చింది. అనంతరం అతని శవాన్ని బ్యాగులో కుక్కి పక్కింటి మేడపై విసిరింది. అప్పటికే బాబు కనిపించట్లేదని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా వెలుగులోకి...
మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు బాలుడి ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో ఓ ఇంటి మేడపై బ్యాగు కనిపించింది. దాన్ని తెరి చూడగా అందులో బాలుడి శవం కనిపించింది. బాలుడి గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. ఘటనపై స్థానికులను ఆరా తీయగా... ఆ బాలుడిని చివరిసారిగా నీలం గుప్తాతో చూసినట్లు వారు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. తానే బాలుడిని హత్య చేసినట్లు ఆమె నేరం అంగీకరించింది.
ఆందోళన రేకెత్తిస్తున్న ఘటనలు..
సంతానం కలగట్లేదని అత్తింటివారు వేధిస్తున్న కారణంగానే ఆమె మాంత్రికుడిని సంప్రదించడం... అతని సలహా మేరకు నరబలి ఇవ్వడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రణవ్ వెల్లడించారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా,ఏపీలోని చిత్తూరులోనూ మంత్రాలు,ఆధ్యాత్మికత పేరుతో ఉన్నత విద్యావంతులైన ఓ దంపతులు తమ ఇద్దరు బిడ్డలను దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. కేరళలోని పాలక్కడ్ జిల్లాలోనూ దేవుడు ఆదేశించాడని ఓ మహిళ తన కన్న కొడుకునే బలిచ్చిన ఘటన నెలక్రితం వెలుగులోకి వచ్చింది. ఇలా మూఢనమ్మకాల పేరుతో హత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.