వివాదంతో హీరో మోహన్లాల్ మనస్తాపం: ఫీజు వెనక్కి
తిరువనంతపురం: సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు మలయాళీ చిత్ర నటుడు మోహన్లాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన మ్యూజిక్ బ్యాండ్ లాలిజం ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ ప్రదర్శనకు తాను తీసుకున్న ఫీజును వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడ్డారు.
ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. బలమైన విమర్శతో బాధపడిన తాను వివాదం నుంచి బయటపడ దలుచుకున్నానని, తాను తీసుకున్న 1.63 కోట్ల రూపాయలను వెనక్కి ఇస్తానని ఆయన ఆ లేఖలో చెప్పారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, క్రీడా మంత్రి తిరువంచూరు రాధాకృష్ణన్ అడగడంతో తాను ఆ ప్రదర్శనకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
కానీ, తన అభిమానుల్లో సందేహాలు తలెత్తాయని, దీంతో తాను తీసుకున్న ఫీజును వెనక్కి ఇస్తానని, దీంతో వివాదానికి తెర పడుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. భారీ ఫీజు తీసుకున్న మోహన్లాల్, ఆయన బృందం ఇచ్చిన ప్రదర్శన బాగా లేదని విమర్శలు తలెత్తాయి. శనివారంనాడు జాతీయ క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి ఆయన అధికారిక బ్లాగ్లో విమర్శల జడివాన కురిసింది.
మోహన్ లాల్ తీసుకున్న ఫీజును వెనక్కి ఇవ్వాలనే డిమాండ్ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే మోహన్లాల్ భారీ ఫీజు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తన బ్యాండులో ఉన్న కళాకారుల కోసమే ఆ డబ్బు తీసుకున్నట్లు మోహన్ లాల్ చెప్పారు కూడా. తాను పైసా కూడా తీసుకోలేదని చెప్పారు.