పంజాబ్ బ్యాంక్ స్కాం: ప్రధాని మోడీ, నీరవ్ మోడీ ఫోటో, అమిత్ షా క్లారిటీ, గూండారాజ్యం!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ, పంజాబ్ నేషల్ బ్యాంకు స్కాం కేసులో దేశం విడిచిపారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కలిసి ఉన్న ఫోటో విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఆ ఒక్క ఫోటో అడ్డం పెట్టుకుని కొందరు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, వ్యాపారి నీరవ్ మోడీ ఓ పబ్లిక్ ప్రోగ్రామ్ లో గ్రూప్ ఫోటో తీసుకున్నారని, దీన్ని ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని అమిత్ షా ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
మీరు ఇక్కడ ఉంటే
మూడు రోజుల కర్ణాటక పర్యటనలో ఉన్న అమిత్ షా మంగళూరులో మాట్లాడుతూ మీరు ఇప్పుడు ఈ వేదిక మీద నా పక్కన ఉంటే ఎవరో ఒకరు ఫోటో తీస్తారు, అందుకు నాకు మీకు సంబంధం ఉన్నట్లా అని ప్రతి ప్రక్షాలను అమిత్ షా ప్రశ్నించారు.
ఎవ్వరినీ వదిలిపెట్టం
నీరవ్ మోడీతో సహ బ్యాంకులను మోసం చేసిన వారిలో ఎవ్వరినీ వదిలిపెట్టమని అమిత్ షా చెప్పారు. ఇప్పటికే నీరవ్ మోడీ కేసు విషయంలో విచారణ ముమ్మరం అయ్యిందని, ఆ విషయం ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదని అమిత్ షా అన్నారు.
రూ. 5 వేల కోట్ల ఆస్తులు సీజ్
నీరవ్ మోడీకి సంబంధించిన రూ. 5,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారని అమిత్ షా వివరించారు. నీరవ్ మోడీ ఎన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు మోసం చేశారు అనే విషయం అధికారులు బయటకులాగుతున్నారని, పైసాతో సహ మొత్తం రికవరీ చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
గూండారాజ్యం
కర్ణాటకలో గత నాలుగు సంవత్సరాలకు పైగా గూండారాజ్యం నడుస్తోందని అమిత్ షా ఆరోపించారు. సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 24 మంది హిందూ కార్యకర్తలను హత్య చేస్తే ఒక్క కేసులో కూడా నిందితులను శిక్షించిన పాపానపోలేదని అమిత్ షా విమర్శించారు.
దేశంలోనే చూడలేదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలాంటి అవినీతి సీఎంను తాను ఇప్పటి వరకూ దేశంలో ఎక్కడా చూడలేదని అమిత్ షా ఆరోపించారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కర్ణాటకలోని ప్రజలు అందరూ సిద్దంగా ఉండాలని బీజేపీ చీఫ్ అమిత్ షా పిలుపునిచ్చారు.