పాక్కి వంతపాడుతూ కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన టర్కీ: భారత్ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇప్పటికే పాకిస్థాన్ దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్.. ఇప్పుడు ఆ దేశానికి మిత్రదేశంగా మారిన టర్కీకి కూడా అదే స్థాయిలో హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి వేదికపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి మనదేశ అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్కు భారత్ ఘాటుగా బదులిచ్చింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని తేల్చి చెప్పింది. సొంత దేశ వ్యవహారాలపై దృష్టి సారించాలని హితవు పలికింది.
పాకిస్థాన్ దుస్సాహసం: జమ్మూకాశ్మీర్నూ తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ విడుదల
మా అంతర్గత విషయంలో జోక్యం వద్దు..
‘భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ గురించి టర్కీ అధ్యక్షుడు ప్రస్తావించడాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం' అని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి తిరుమూర్తి స్పష్టం చేశారు. అంతేగాక, ‘టర్కీ చర్య ముమ్మాటికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే. దీన్ని మేం ఏ మాత్రం సంహించబోం. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ిన గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి. సొంత దేశ విధానాలపై దృష్టి సారించాలి' అని భారత ప్రతినిధి ఘాటుగా బదులిచ్చారు.
టర్కీ అధ్యక్షుడి వీడియో సందేశంపై ఆగ్రహం.. ఇదే మొదటిసారి కాదు..
ఐక్యరాజ్యసమితి సర్వసప్రతినిధి సభ 74వ వార్షిక సమావేశాల్లో మంగళవారం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తన వీడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ ప్రాంతంపై ఉన్న వివాదాన్ని ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం పరిష్కరించాలంటూ పిచ్చికూతలు కూశారు. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. 2019లోనూ ఎర్డోగన్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భారత్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కూడా ఐరాస వేదికపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటివి పునరావృతం చేయొద్దని గట్టిగా హెచ్చరించింది.
ఉగ్ర పాక్కు మద్దతిస్తూ పరువు తీసుకుంటున్న టర్కీ..
పాకిస్థాన్ కూడా పలుమార్లు కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా.. ఆ దేశానికి చెంపపగులగొట్టేలా భారత్ బదులిచ్చిన విషయం తెలిసిందే. కాగా, టర్కీ గత కొంత కాలంగా పాకిస్థాన్ దేశానికి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇరుగుపొరుగుదేశాలతో శత్రుత్వం పెంచుకుంటున్న టర్కీ.. ఉగ్ర పాక్తో చేతులు కలిపింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశం పాక్ లేవనెత్తితే టర్కీ అందుకు వత్తాసు పలుకుతూ వస్తోంది. దీంతో ఈ రెండు దేశాలకు భారత్ గట్టిగానే బదులిస్తూ వస్తోంది.