Union Budget 2020: విద్యారంగంలో సంచలనాలు.. రూ. 99,300వేల కోట్ల కేటాయింపు.. ఎఫ్డీఐలకు తలుపులు..
Recommended Video
విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసేదిశగా మోదీ సర్కార్ అడుగులువేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈమేరకు సరికొత్త విద్యావిధానాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు. అదేసమయంలో దేశీయ విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులు(ఎఫ్డీఐ)ను కూడా ఆహ్వానించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
దండిగా నిధులు.
రాబోయే పదేళ్లలో.. అంటే 2030 నాటికి ప్రపంచం మొత్తంలో ‘పనిచేయగలిగిన సామర్థ్యం ఉండే జనాభా(వర్కింగ్ ఏజ్ పాపులేషన్)' భారత్ లోనే అత్యధికంగా ఉండబోతున్నదని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాలకు పెద్దపీట వేస్తామని మంత్రి నిర్మల చెప్పారు. పార్లమెంట్ లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2020-21లో ఈ మేరకు విద్యారంగానికి రూ. 99,300వేల కోట్లు కేటాయించారు. ఇప్పటికే దేశంలో కొనసాగుతోన్న విద్యాలయాలను మరింత బలోపేతం చేస్తామన్నారు.
కొత్త విద్యావిధానం..
ప్రపంచదేశాలకు గట్టి పోటీ ఇస్తూ.. మెరికల్లాంటి నిపుణుల్ని తయారుచేసేలా దేశంలో విద్యావస్థను పటిష్టం చేస్తామని నిర్మల చెప్పారు. ఇందుకోసం కొత్త విద్యావిధానాన్ని రూపొందిస్తున్నామని, అతి త్వరలోనే కేంద్రం దీనిపై కీలక ప్రకటన చేస్తుందని తెలిపారు. అలాగే, ఆన్ లైన్ విద్యాకార్యక్రమాలను కూడా విస్తరించబోతున్నట్లు చెప్పారు. నేసనల్ ఇనిస్టిట్యూషననల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో టాప్ 100 ర్యాంకులు పొందిన విద్యాసంస్థలన్నీ డిగ్రీ వరకు పూర్తి స్థాయిలో ఆన్ లైన్ విద్యను అందించే పనిని చేపడతాయన్నారు.
ఎఫ్డీఐలకు వెల్కమ్..
ప్రపంచ వ్యాప్తంగా భారతీయ విద్యా సంస్థల పట్ల సానుకూలత ఉందన్న మంత్రి నిర్మల.. దేశ విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీని ద్వారా విదేశీ యూనివర్సిటీలు భారత్ లో నేరుగా కార్యకలాపాలు నిర్వహించుకునే వీలుంటుందని తెలిపారు. మంత్రి ఈ ప్రకటన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తూ విదేశీ వర్సిటీలకు ఆహ్వానం పలుకుతున్నారంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా వారించడంతో ప్రతిపక్ష ఎంపీలు వెనక్కితగ్గారు.
స్కిల్ డెవెలప్మెంట్ కు రూ.3వేల కోట్లు
దేశవ్యాప్తంగా చాలా రంగాల్లో నిపుణుల కొరత ఉందని, స్కిల్ డెవెలప్మెంట్ కు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. 2020-21 బడ్జెట్ లో స్కిల్ డెవెల్మెంట్ కోసం రూ.3వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర స్కిల్ డెవెలప్మెంట్ శాఖ ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలోనే నర్సులు, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు.