వైద్యరంగంకు నిర్మలమ్మ మెడిసిన్: కోవిడ్ వ్యాక్సిన్కు రూ.35వేల కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దీనికి అనుగుణంగా బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి 35 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలిపారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి 35 వేల కోట్ల రూపాయలతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తామని అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను కేటాయించడానికి వెనుకాడబోమని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ కింద దేశం సొంతంగా రెండు కరోనా వ్యాక్సిన్లను రూపొందించిందని గుర్తు చేశారు. మరో రెండు వ్యాక్సిను అందుబాటులోకి రాబోతోన్నాయని తెలిపారు. దేశీయంగా రూపొందించిన వ్యాక్సిన్లను వందకు పైగా విదేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కింద ఇది సాధ్యపడిందని అన్నారు. సకాలంలో వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించగలిగామని, ఫలితంగా అత్యంత తక్కువ శాతం మరణాలను నమోదు చేసిన దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మార్చుకోవడంలో విజయం సాధించామని అన్నారు.
వైద్య రంగానికి 2.23 లక్షల కోట్ల రూపాయలను కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఆర్తిక సంవత్సరం నాటితో పోల్చుకుంటే.. ఈ మొత్తాన్ని రెట్టింపు చేశామని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 94,452 లక్షల కోట్ల రూపాయలను కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 2.23 లక్షల కోట్ల రూపాయలకు పెంచామని అన్నారు. ఇదివరకటితో పోల్చుకుంటే ఈ మత్తం 137 శాతం అధికమని తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పారు. ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ల కోసం 35 వేల కోట్ల రూపాయలు చాలవని అనుకుంటే.. మరింత నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.