Union Budget 2025: ఐటీ రిబేట్ పెరుగుతుందా ? ఉద్యోగ వర్గాల అంచనాలివే..!
ఈసారి కేంద్ర బడ్జెట్ పై వేతన జీవుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు ఈసారి ఆదాయపు పన్ను విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరటనిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈసారి ఆదాయపు పన్ను సరళీకరణ విషయంలో మార్పులు ఉంటాయన్న అంచనాలే. ఇందులో పలు అంశాలు ఉద్యోగుల్ని ఊరిస్తున్నాయి. ఇందులో కీలకమైనది ఆదాయపు పన్ను రిబేట్ పెంపు.
ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను చెల్లించే ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతారని అత్యధికులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న మధ్యతరగతి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రిబేట్ పెంచబోతున్నారనేది మరో అంచనా.

ఆదాయపు పన్ను చెల్లించే వారిలో తక్కువ ఆదాయం కలిగిన వారికి రిబేట్ మొత్తాన్ని పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఇలా పాత, కొత్త.. రెండు పన్ను విధానాలలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. అలాగే గృహరుణాలపై అధిక వడ్డీ మినహాయింపు పరిమితి ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం ఒక ఇంటికి చెల్లించిన పూర్తి వడ్డీకి మినహాయింపు ఇవ్వాలని లేదా ప్రస్తుత పరిమితి రూ.2 లక్షలను 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
ఆదాయపు పన్ను వసూళ్ల విషయంలో ప్రతీ ఏటా ఐటీ శాఖ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏటికేడాది రిటర్నలు, వాటిని దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మినహాయింపుల డిమాండ్లు కూడా మధ్యతరగతి నుంచి అంతే స్ధాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరెస్సెస్ అనుబంధ ఉద్యోగ సంఘాలు కూడా పలు డిమాండ్లను ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉంచాయి. ఇందులో 10 లక్షలకు ఐటీ ఆదాయం మినహాయింపు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ బడ్డెట్ అంచనాలను అందుకుంటుందా లేక నిరాశపరుస్తుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications