Nisith Pramanik: మమతా బెనర్జీ అనుచరుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు: యంగెస్ట్ ఆయనే
న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ ఊరిస్తూ వచ్చిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ ముగిసింది. రాష్ట్రపతి భవన్లో 43 మంది పాత, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రాలకు ఊహించినట్టే కొంత ప్రాతనిథ్యాన్ని కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు రాజకీయంగా హాట్సీట్గా మారిన పశ్చిమ బెంగాల్, కర్ణాటక నుంచీ పెద్ద సంఖ్యలో ఎంపీలను తన కేబినెట్లోకి తీసుకున్నారాయన.
పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి చెందిన నలుగురికి కేబినెట్లో చోటు కల్పించారు. బాంకుర ఎంపీ సుభాష్ సర్కార్, బొంగావ్ లోక్సభ సభ్యుడు శంతను ఠాకూర్, అలీపూర్ దౌర్ నుంచి లోక్సభకు ఎన్నికైన జాన్ బర్లా, కూచ్ బెహర్ ఎంపీ నితీష్ ప్రామాణిక్ కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నలుగురిలో నితీష్ ప్రామాణిక్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్నారు.

నరేంద్ర మోడీ కేబినెట్లో మొత్తంలో నితీష్ ప్రామాణిక్ యువ మంత్రి. ఆయన వయస్సు 35 సంవత్సరాలే. 1986 జనవరి 17వ తేదీన ఆయన దిన్హాటలో జన్మించారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదివారు. ఓ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులు వేశారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. యువజన విభాగం నేతగా క్రియాశీలకంగా వ్యవహరించారు. 2018 నాటి పంచాయత్ ఎన్నికల్లో తృణమూల్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. చురుకైన యువనేతగా మమతా బెనర్జీ మెప్పును పొందారు.
ఆ మరుసటి ఏడాదే నితీష్ ప్రామాణిక్ తృణమూల్కు గుడ్బై చెప్పారు. 2019 ఫిబ్రవరిలో పార్టీ ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూచ్ బెహర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పరేష్ చంద్ర అధికారిని 54 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాజాగా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ కొత్త కేబినెట్లో అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications