కేంద్రమంత్రి అనిల్ దవే(61) హఠాన్మరణం: మోడీ దిగ్భ్రాంతి
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే(61) గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోడీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే(61) హఠాన్మరణం చెందారు. గురువారం ఉదయం దవే అనారోగ్యానికి గురికావడంతో వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతిచెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన నరేంద్ర మోడీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
1956 జూలై 6న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జన్మించిన ఆయన.. ఇండోర్లోని గుజరాతీ కాలేజీ నుంచి ఎంకామ్ విద్యను అభ్యసించి, ఆపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరి రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. నర్మదా నదిని బహుళ ప్రయోజనకారిగా చేయాలన్న ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
2009లో తొలిసారి రాజ్యసభకు ఎంపికైన ఆయన, నీటి వనరుల కమిటీ, సమాచార, ప్రసారాల శాఖ కమిటీ, వాతావరణ మార్పులపై అధ్యయన కమిటీ సహా పలు కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు.
Absolutely shocked by the sudden demise of my friend & a very respected colleague, Environment Minister Anil Madhav Dave ji. My condolences.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
గత సంవత్సరం జూలై 5న నరేంద్ర మోడీ తన క్యాబినెట్ను విస్తరించగా.. పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా దవే బాధ్యతలు స్వీకరించారు. దవే హఠాన్మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Anil Madhav Dave ji will be remembered as a devoted public servant. He was tremendously passionate towards conserving the environment.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
I was with Anil Madhav Dave ji till late last evening, discussing key policy issues. This demise is a personal loss.
— Narendra Modi (@narendramodi) May 18, 2017
బుధవారం సాయంత్రం వరకు దవేతో తాను మాట్లాడనని, ఎన్నో ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన ఇకలేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నారు. దవే మృతి పట్ల కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.