పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం.. కేంద్రంపై పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు, వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ లల్లో ఆయన పర్యటించాల్సి ఉండగా.. వాటిని రద్దు చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. ఆది, సోమవారాల్లో అమిత్ షా- మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ ల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మేఘాలయా రాజధాని షిల్లాంగ్ లోని నార్త్-ఈస్ట్ పోలీస్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం అమలు నేపథ్యంలో షిల్లాంగ్ సహా పొరుగు జిల్లాల్లో అల్లర్లు చెలరేగుతుండటం, అస్థిరత్వ పరిస్థితులు ఏర్పడటం వల్ల అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

షిల్లాంగ్ నార్త్-ఈస్ట్ పోలీస్ అకాడమీలోనే ఆయన ఆదివారం రాత్రి బస చేసి, మరుసటి రోజు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ స్టేట్ ఫెస్టివల్ లో అమిత్ షా పాల్గొనాల్సి ఉండగా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దయిన నేపథ్యంలో.. ఆయన తన షెడ్యూల్ ను మార్చుకున్నారని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications