ఐఎస్ఐఎస్ తో ప్రపంచానికే ప్రమాదం: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ నుంచి భారత్ కు ముప్పు పొంచివుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత భారతదేశంలో అప్రమత్తత ప్రకటించామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారత్ లోని అన్ని నగరాలలో హై అలర్ట్ ప్రకటించామని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు భారత్ లో దాడులు చెయ్యడానికి అవకాశం ఇవ్వమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 129 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
350 మందికి తీవ్రగాయాలు కావడంతో ఫ్రాన్స్ లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు. ఫ్రాన్స్ సరిహద్దులు మూసి వెయ్యాలని అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హోలండ్ ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత చర్యగా ప్రపంచ దేశాలు హై అలర్ట్ ప్రకటించాయి.