'మహా' పొత్తు చిచ్చు: రాజీనామా దిశగా అనంత్ గీతే
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ - శివసేనల పొత్తు విఫలం కావడంతో కేంద్రమంత్రి అనంత్ గీతే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన భారత్ రాగానే అనంత్ గీతే రాజీనామా సమర్పించనున్నారని తెలుస్తోంది.
నరేంద్ర మోడీ కేబినెట్లో శివసేనకు చెందిన ఏకైక మంత్రి అనంత్ గీతే. మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు కలిసి పోటీ చేశాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మిత్రపక్ష పార్టీలను కూడా మోడీ కేబినెట్లోకి తీసుకున్నారు.
అందులో భాగంగా శివసేనకు చెందిన అనంత్ గీతేను నరేంద్ర మోడీ కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే, 25 ఏళ్ల సేన, బీజేపీ పొత్తు మహారాష్ట్రలో విఫలం కావడంతో అనంత్ గీతే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, అనంత్ గీతే కేబినెట్లో ఉంటారా లేదా అనే విషయమై ఇంకా నిర్ణయం జరగలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అదివారం చెప్పారు. ఈ విషయం గురించి తామేం ఆలోచించలేదని రాజ్ నాథ్ చెప్పారు.