సీఎం ఉద్ధవ్కు ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యలు: కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టైన కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ లభించింది. రాయ్గఢ్లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని కోర్టులో నారాయణ రాణే తరపు న్యాయవాదులు వాధించారు.
కేంద్రమంత్రి నారాయణ ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం నారాయణ రాణే రాయ్గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాణే మాట్లాడుతూ.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని, అలాంటి వ్యక్తి చెంప పగలగొట్టాలని అన్నారు. కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను మంగళవారం అరెస్ట్ చేశారు. భోజనం చేస్తున్న సమయంలోనే కేంద్రమంత్రిని అరెస్ట్ చేయడం గమనార్హం.

ఈ క్రమంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కేంద్రమంత్రి రాణే. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మహద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేంద్రమంత్రికి ఊరట లభించింది.
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు శివసేన-బీజేపీ మధ్య చిచ్చు రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా శివసేన,బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగుతున్నారు. మంగళవారం(ఆగస్టు 24) ముంబైలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జితో చెదరగొట్టారు.
నారాయణ రాణే వ్యాఖ్యలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ముంబైలోని ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు.బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డగించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆపై ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ రాణేకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు... ఉద్దవ్ థాక్రేకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు అందరినీ చెదరగొట్టడంతో ఉద్రిక్తతలకు తెరపడింది.
Recommended Video
అనంతరం ఆ రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను మరో దారి గుండా మళ్లిస్తున్నారు. కేంద్రమంత్రి నివాసంతో పాటు ఆ మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోనూ శివసేన-బీజేపీ మద్దతుదారులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. నాగ్పూర్,నాసిక్లోని బీజేపీ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని కేంద్రమంత్రి నారాయణ్ రాణే విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఉద్ధవ్ ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో పక్కనున్న వారిని అడిగి చెప్పారని... ఆ సమయంలో తాను గనుక అక్కడ ఉండి ఉంటే థాక్రే చెంప పగలగొట్టేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు కేంద్రమంత్రి రాణే.












Click it and Unblock the Notifications