మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లో ప్రహ్లాద్ జోషి
బెంగళూరు: మరో కేంద్రమంత్రి కరోనా బారినపడ్డారు. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కరోనా సోకింది. బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
నేను కరోనా బారినపడ్డాను. తాజా చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలూ లేవు. వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉన్నా అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, కోల్, మైన్స్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ధర్వాడ్ లోక్ సభ స్థానం నుంచి ప్రహ్లాద్ జోషి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఉన్న జోషీ.. ఇటీవల జరిగిన సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
ಆತ್ಮೀಯರೆ
— Pralhad Joshi (@JoshiPralhad) October 7, 2020
ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ನನಗೆ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದೆ. ಯಾವುದೇ ರೋಗ ಲಕ್ಷಣಗಳು ಇರುವದಿಲ್ಲ. ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಹೋಮ್ ಕ್ವಾರಂಟೈನ್ ಆಗಿದ್ದೇನೆ.
I have tested positive for #COVID19 . As I am asymptomatic, as per doctor's advise I am in home quarantine.
కాగా, కర్ణాటకకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ అంగడి కరోనా బారినపడి మరణించిన విషయం తెలిసిందే. ఈయనతోపాటు బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తి, బసవకళ్యాణ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నారాయణ రావు కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కూడా కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతోపాటు పలువురు మంత్రులు కూడా కరోనా బారినపడ్డారు.
కర్ణాటకలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,68,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,16,153 యాక్టివ్ కేసులున్నాయి. 5,42,906 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9,574 మంది కరోనా బారినపడి మరణించారు.