కేంద్రం నుంచి కొత్త ముఖ్యమంత్రి: శాసనసభా పక్ష భేటీకి హాజరు: ఎన్నిక లాంఛనమేనా?
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా ముఖ్యమంత్రిని మార్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన త్రివేంద్ర సింగ్ రావత్కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో కొత్త నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టనుంది. కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశ్శాంక్ను ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్కు పంపించడం దాదాపు ఖాయమైనట్టే.
ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోయే బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. నిజానికి- అయిదేళ్ల కాలపరిమితి ముగియకుండానే ముఖ్యమంత్రిని మార్చడం బీజేపీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకం. అయినప్పటికీ.. త్రివేంద్ర సింగ్ రావత్ మీద నెలకొన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు అర్ధాంతరంగా ఉద్వాసన పలికినట్లు చెబుతున్నారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆయన పనితీరు ఆశించినంత వేగంగా లేదనే అభిప్రాయాలు బీజేపీ పెద్దల్లో వ్యక్తమౌతోన్నాయి.
ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు, ఎమ్మెల్యేల్లోనూ ఇదే తరహా అసంతృప్తి నెలకొని ఉండటం వల్ల.. ఆయనను మార్చాల్సి వచ్చిందని అంటున్నారు. త్రివేంద్ర సింగ్ స్థానంలో రమేష్ పోఖ్రియాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బీజేఎల్పీ భేటీకి ఆయన హాజరు కావడం.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. బీజేపీ శాసనసభా పక్ష నేతగా పోఖ్రియాల్ను ఎంపిక చేయడం లాంఛనప్రాయమేనని సమాచారం.
రమేష్ పోఖ్రియాల్.. హరిద్వార్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్కు చెందిన అంబరీష్ కుమార్ను రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తోన్నారు. ఇప్పుడున్న పరిణామాల్లో ముఖ్యమంత్రి పదవికి ఆయనే తగిన నాయకుడిగా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.