JNU violence: లెఫ్ట్ విద్యార్థి సంఘాల బండారం బయటపడింది.. జేఎన్యూ హింసపై కేంద్ర మంత్రుల కామెంట్లు
ఢిల్లీలోని జేఎన్యూలో హింసకాండపై శుక్రవారం పోలీసులు ఇచ్చిన వివరణతో లెఫ్ట్ విద్యార్థి సంఘాల కుట్రలు బట్టబయలయ్యాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరాని అన్నారు. వర్సిటీలో దాడులకు పాల్పడినవారిలో జేఎన్ యూ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తోపాటు మరో ఎనిమిది విద్యార్థుల్ని గుర్తించామన్న పోలీసులు అందుకు సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టారు.
దాడి జరిగినప్పటి నుంచి అది బీజేపీ, ఏబీవీపీల పనే అనే తప్పుడు ప్రచారం జరిగిందని, అందులో ఎంతమాత్రం నిజం లేదని పోలీసుల ప్రకటనతో తేలిపోయిందని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పక్కా వ్యూహం ప్రకారమే లెఫ్ట్ సంఘాల విద్యార్థులు.. వర్సిటీలో సీసీటీవీ కెమెరాలు, సర్వర్ గదిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
జేఎన్ యూలో హింసకు ముమ్మాటికి లెఫ్ట్ సంఘాలే బాధ్యులని మొదటి నుంచీ తాను చెప్పిన మాటలు ఇవాళ నిజమయ్యాయని, ఐషే ఘోష్ సహా పలువురు లెఫ్ట్ విద్యార్థులు.. సాధారణ విద్యార్థులపై దాడి చేసిన ఫొటోలు బయటికి రావడంతో వాళ్ల దుర్మార్గం అందరికీ తెలిసొచ్చిందని మంత్రి స్మృతి ఇరాని అన్నారు.
వింటర్ సెమిస్టర్ ఫీజుల రిజిస్ట్రేషన్ ను అడ్డుకునే క్రమంలో లెఫ్ట్ సంఘాలు పలువురు విద్యార్థులపై దాడి చేసినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ జాయ్ టిర్కే, ఢిల్లీ పోలీస్ శాఖ పీఆర్వో ఎంఎస్ రంధావా శుక్రవారం మీడియాకు తెలిపారు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా వారు విడుదల చేశారు. అయితే ఐషే ఘోష్ మాత్రం అవన్నీ నిరాధారమైన ఆరోపణలని, న్యాయం కోసం పోరాడుతామని చెప్పారు.