మోదీ సహచరుడి కూతురు బలి -కరోనాతో కేంద్ర మంత్రి గెహ్లాత్ బిడ్డ యోగిత కన్నుమూత -షాకింగ్ రిపోర్ట్
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయి నుంచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. డబుల్, ట్రిపుల్ మ్యూటేషన్లు, కొత్త రకం వేరియంట్ల కారణంగా రోజువారీ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వైరస్ కాటుకు ప్రతిరోజూ దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సహచరుడు, కేంద్ర కేబినెట్ మంత్రి కూతురు సైతం కొవిడ్ కారణంగా కన్నుమూశారు..

కేంద్ర మంత్రి కూతురు మృతి
మోదీ మంత్రివర్గంలో కేబినెట్ హోదాతో సామాజిక న్యాయం, సాధికారత శాఖకు మంత్రిగా పనిచేస్తోన్న తవర్ చంద్ గెహ్లాత్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రి గెహ్లాత్ కూతురు యోగితా సోలంకి(44) కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే టెస్టుల నిర్ధారణ దగ్గర్నుంచి ప్రాణాలు పోయేదాకా ఆమె రిపోర్టులు, వైద్యం పొందిన తీరు అనూహ్యంగా ఉన్నాయి. కూతురి మరణానికి సంబంధించి మంత్రి గెహ్లాత్ కార్యాలయం ఈ మేరకు వివరాలను విడుదల చేసింది..

ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ కానీ..
కేంద్ర మంత్రి గెహ్లాత్ కూతురు యోగితా సోలంకి తన కుటుంబంతో కలిసి ఉజ్జయినిలో నివసించేవారు. ఆమె భర్త మధ్యప్రదేశ్ వైద్యశాఖలో ఉన్నతోద్యోగి. వారికి 23ఏళ్ల కూతురు, 20ఏళ్ల కొడుకు ఉన్నారు. రెండు వారాల కిందట కొవిడ్ లక్షణాలతో బాధపడిన యోగితాను ఉజ్జయినిలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయగా కొవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చింది. కానీ లక్షణాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే ఆమెకు సీటీ స్కాన్ నిర్వహించగా షాకింగ్ రిపోర్టు బయటపడింది. అప్పటికే యోగిత ఊపిరితిత్తులు 90 శాతం డ్యామేజ్ అయినట్లు తేలింది. దీంతో ఆమెను హుటాహుటిన ఇండోర్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు..

అవయవాలు దెబ్బతిని గుండెపోటు
ఇండోర్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగానే యోగిత అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటూ వచ్చాయి. ఊపిరితిత్తుల డ్యామేజీకి తోడు బ్లడ్ క్లాట్స్ కారణంగా గుండెపోటు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కన్నుమూశారు. కూతురు చనిపోయే సమయానికి మంత్రి గెహ్లాట్.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కొవిడ్ నియంత్రణ సమావేశంలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ప్రధాని అనుమతితో ఢిల్లీ నుంచి ఇండోర్ బయలుదేరారు. కేంద్ర మంత్రి కూతురి మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాలు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు 5,88,368 కేసులు, 5,812మరణాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications