రాజీవ్ యువవికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో యువత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కొత్త ఊపిరి పోసే శుభవార్తను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజీవ్ యువవికాసం పథకం ద్వారా యువకులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాజీవ్ యువవికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహాయం అందించడానికి తెలంగాణా ప్రభుత్వం సుముఖంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ యువత ఆర్ధిక ప్రగతి సాధించడానికి ఈ పథకం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

50వేల నుండి 4లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడిన ఆర్ధికసహాయం
భట్టి విక్రమార్క తాజాగా చేసిన ప్రకటనతో యువవికాసం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే, ఈ పథకంలో భాగంగా 50 వేల రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీతో కూడిన ఆర్ధిక సహాయం అందుతుంది. SC, ST, BC, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు దీని ద్వారా లబ్ది జరుగుతుంది. మైనారిటీ యువకులు సామాజిక ఆర్థిక రంగాల్లో ముందుకు సాగడానికి ఇది ఒక మైలురాయి అవుతుందని భావిస్తున్నారు.
సమగ్రంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని యోచన
ఈ క్రమంలో ఈ పథకం అమలు దశలో యువత నుంచి సూచనలు స్వీకరించి, మరింత సమగ్రంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం యువతకు ఇస్తున్న ఈ ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు.
మైనార్టీల అభ్యున్నతిపై భట్టి కీలక వ్యాఖ్యలు
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మైనారిటీ సమాజాల అభ్యున్నతి ప్రభుత్వ అజెండాలో ముఖ్య భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 20 మైనారిటీ గురుకులాల నిర్మాణం పూర్తి కావడంతో వాటి ప్రారంభోత్సవాలు త్వరలో జరగనున్నాయని వెల్లడించారు. ఇవి మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించి ఉన్నత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణా ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల ప్రణాళికపై భట్టి
తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాన కార్యక్రమంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు నిర్వహించి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు.వక్ఫ్ భూములు, మైనారిటీల సంబంధిత ఆస్తులు ఎలాంటి అన్యాక్రాంతం లేకుండా కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నచోట శ్మశాన వాటికల కోసం స్థలాలు
ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించి, చుట్టూ ప్రహరీలు నిర్మించాలని సూచించారు. ఇలాంటి చర్యలు మైనారిటీలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పాల్గొని, హైదరాబాద్లో మొహర్రం 9వ రోజు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications