అన్లాక్ 4.0: మరో 100 రైళ్లను నడపనున్న భారత రైల్వే
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్లాక్ 4.0 సడలింపుల నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం రైళ్లు నడిపేందుకు భారత రైల్వే కసరత్తులు ప్రారంభించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా 100 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Recommended Video
త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను రైల్వే శాఖ హోంశాఖకు పంపింది. హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ.. ఎక్కువగా ప్రయాణికులు ఉండే మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపాయి. పలు పట్టణాల్లో సబర్బన్ రైళ్లు నడిపేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్లాక్ 4 నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో మెట్రో రైలు సేవలు సెప్టెంబర్ 7 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రైల్వే సేవలను ప్రారంభించనున్నాయి. ప్రయాణికులు కూడా పలు కరోనా నిబంధనలు పాటిస్తూ తమ ప్రయాణాలు సాగించాలని సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications