మైన్పురి బైపోల్లో రికార్డు మెజార్టీతో డింపుల్ యాదవ్ గెలుపు: మామను మించి, 2 లక్షలకుపైగా
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మైన్పురి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డింపుల్ ఘన విజయం సాధించారు.
డింపుల్ తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కోడలు, ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో దిగారు.
ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. 2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకుపైగా మెజార్టీనితో గెలుపొందడం గమనార్హం.
సమాజ్ వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న మైన్పురికి డిసెంబర్ 5న ఉపఎన్నిక జరిగింది. 56 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. ఎస్పీకి 64.2 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 34.1 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఎస్పీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
మరోవైపు, రాంపుర్ సదర్ నుంచి ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా.. బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనాపై ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 33 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. ఖత్ రౌలిలో ఆర్ఎల్డీ పార్టీకి చెందిన మదన్.. బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ పై ఆధిక్యంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 56.46 శాతం ఓటింగ్ నమోదైంది.