అమాయక జంటలను, యువతను వేధించవద్దు: యూపీ సీఎం యోగి
అమాయక యువత, జంటలపై వేధింపులకు పాల్పడవద్దని యాంటీ రోమియో స్క్వాడ్ కు యోగి సూచించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మహిళా భద్రత కోసం యాంటీ రోమియో స్క్వాడ్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంటీ రోమియో స్క్వాడ్ పనితీరు మోరల్ పోలిసింగ్ పేరుతో వేధింపుల దాకా వెళ్లిందన్న వార్తలు జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమయ్యాయి.
అమ్మాయిలు.. అబ్బాయిలు కలవడం ఎప్పటికీ సాధ్యపడదు అంటూ కొంతమంది యువకులకు యాంటీ రోమియో స్క్వాడ్ హితబోధ కూడా చేశారు. ఈ పరిణామాలన్ని సీఎం యోగి దృష్టికి వెళ్లడంతో వేధింపులు వద్దంటూ యాంటీ రోమియో స్క్వాడ్ టీమ్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. యోగి పాలనలో పోలీసుల ప్రవర్తన శృతిమించుతుందన్న ఆరోపణలు రావడంతో తాజాగా ఆయన ఈ ఆదేశాలిచ్చారు.
అమాయక యువత, జంటలపై వేధింపులకు పాల్పడవద్దని యాంటీ రోమియో స్క్వాడ్ కు యోగి సూచించారు. దీనిపై స్పందించిన అదనపు డీజీ దల్జీత్ చౌదరి అమాయకులను వేధించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.