యోగి ఆదిత్యనాథ్కు తృటిలో తప్పిన ముప్పు: వారణాశిలో..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్కు పక్షి ఢీ కొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వారణాశిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన సురక్షితంగా బయటపడటంతో అధికార వర్గాలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అత్యవసర ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వారణాశి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ మీడియాకు విడుదల చేశారు.
ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ వారణాశిలో పర్యటిస్తోన్నారు. శనివారమే ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో లక్నో నుంచి వారణాశికి చేరుకున్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షలను నిర్వహించారు. ఈ తెల్లవారు జామున కాలభైరవుడు, కాశీ విశ్వనాథుడిని దర్శించారు. ప్రత్యేక పూజలుు చేశారు. మళ్లీ లక్నోకు బయలుదేరారు. ఉదయం 9:05 నిమిషాలకు వారణాశిలోని సర్క్యుట్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో పోలీస్ లైన్ హెలిప్యాడ్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి మళ్లీ ప్రత్యేక హెలికాప్టర్లో లక్నోకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే పక్షి ఢీ కొట్టింది. ఇంజిన్లో సమస్యలు తలెత్తడంతో మళ్లీ పోలీస్ లైన్ హెలిప్యాడ్లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం యోగి ఆదిత్యనాథ్ బబత్పూర్ లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు వెళ్తారని వారణాశి జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్ చెప్పారు.
జులై మొదటివారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాశిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించాల్సిన కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పర్యవేక్షించడానికి యోగి ఆదిత్యనాథ్ వారణాశికి వచ్చారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. కాగా- యోగి ఆదిత్యనాథ్కు తృటిలో ముప్పు తప్పడంతో బీజేపీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.