ప్రియాంక గాంధీపై తిరుగుబాటు.. సీనియర్లపై ఆరేళ్ల బహిష్కరణ వేటు!
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యూపీ కాంగ్రెస్ను యువ నేతలతో నింపేయాలన్న ప్రయత్నానికి సీనియర్లు అడ్డు తగలడంతో పార్టీలో కొత్త ముసలం పుట్టింది. పార్టీ సీనియర్ నేతలను అవమాన పరిస్తున్నారంటూ విమర్శలు చేసిన మాజీ మంత్రులతోపాటు 10 మంది నేతలపై కాంగ్రెస్ అధిస్టానం బహిష్కరణ వేటు వేసింది. యూపీ కాంగ్రెస్లో చోటుచేసుకొన్న తాజా వివాదానికి కారణాలు ఏమిటంటే..
రాజకీయ ఆటలొద్దు.. ఇలాంటి చవకబారు పనులా? మోడీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్
యూపీ కాంగ్రెస్లో ప్రక్షాళన
యూపీ కాంగ్రెస్లో ప్రక్షాళన చేపట్టేందుకు ప్రియాంక గాంధీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజ్బబ్బర్ను అక్టోబర్ 7వ తేదీన తొలగించి యువనేత అజయ్ లల్లూను అధ్యక్షుడిగా నియమించింది. దాంతో పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. యువరక్తం అందించాలనే పేరుతో పార్టీకి సేవ చేసిన సీనియర్లను పక్కన పెట్టడం సరికాదు అంటూ నిరసన వ్యక్తం చేశారు.
రాజ్బబ్బర్కు షాకిచ్చిన ప్రియాంక గాంధీ
యూపీసీసీ అధ్యక్షుడిగా అజయ్ లల్లూని నియమిస్తూ ప్రియాంక గాంధీ తీసుకొన్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొన్న మమ్మల్ని అగౌరవ పరిచారని మీడియాకు ఎక్కారు. దాంతో పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని తొలుత కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అనంతరం సీనియర్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రియాంకపై విమర్శలు చేయడంతో సీనియర్లపై వేటు వేసింది.
సీనియర్ల అసహనం.. తిరుగుబాటు
బహిష్కరణ వేటు పడిన తిరుగుబాటు సీనియర్ నేతల్లో మాజీ ఎంపీ సంతోష్ సింగ్, మాజీ రాష్ట్రమంత్రి రామకృష్ణ ద్వివేది, సత్యదేవ్ త్రిపాఠి, మాజీ ఎమ్మెల్సీ సిరాజ్ మెహందీ, మాజీ ఎమ్మెల్యే భుధార్ నారాయణ్ మిశ్రా, వినోద్ చౌదరీ, నేక్ చంద్ర పాండే, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ గోస్వామి, గోరఖ్పూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంజీవ్ సింగ్ ఉన్నారు. వీరిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు.
సోనియాతో భేటికి ప్రయత్నాలు
బహిష్కరణ వేటు అనంతరం లక్నో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు ఇతర నేతలు గౌర్హాజరయ్యారు. అంతేకాకుండా వేటు గురైన నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోనియా ముందు వారి వాదనలు వినిపించేందుకు, పార్టీ పట్ల విధేయతను ప్రదర్శించుకోనేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.