ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తనను తన మనుమరాలు అదితి సింగ్ వేధిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అదితి సింగ్పై బామ్మ వేధింపుల ఫిర్యాదు
ఆమె ఫిర్యాదు మేరకు ఆగస్టు 10న కమలా సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ స్వప్నిల్ మాంగేన్ గురువారం మీడియాకు తెలిపారు.ఎమ్మెల్యే అదితి సింగ్పై వచ్చిన ఆరోపణలపై వాస్తవాలు వెలికితీసే బాధ్యతను అదనపు ఎస్పీ నిత్యానంద్ రాయ్ కు అప్పగించినట్లు వెల్లడించారు. రాయ్ బరేలీ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కమలాసింగ్ ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదంలో తనను వేధిస్తున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ ఈ కేసును విచారించనున్నారు. అయితే, ఇంతవరకు ఫిర్యాదుదారు, ఆమె కుటుంబసభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ స్వప్నిల్ తెలిపారు.
అదితి సింగ్, బంధువుల బెదిరింపులు
ఎమ్మెల్యే అదితీ సింగ్, ఆమె బంధువులు తనను బెదిరింపులకు గురిచేసినట్లు మహారాజ్ గంజ్లోని లాలూపూర్ గ్రామంలో నివసించే 85 ఏళ్ల కమలాసింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబర్ 30, 2019న తన ఇంట్లో ప్రవేశించి ఆస్తి మొత్తం వారి పేరిట బదిలీ చేయనట్లయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు తెలిపారు.
స్పందించని అదితి సింగ్.. బీజేపీపై కాంగ్రెస్ వ్యంగ్యాస్ట్రాలు
కాగా, తన బామ్మ ఫిర్యాదు విషయంపై అదితి సింగ్ ఇప్పటి వరకు స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు అందినప్పటికీ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అదితి సింగ్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.. ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి.. పెద్దలను గౌరవించాలని ఆ పార్టీ చెప్పలేదా? అని కాంగ్రెస్ నేతలు సొంత పార్టీ రెబల్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
సిగ్గుండాలంటూ కాంగ్రెస్కు బీజేపీ కౌంటర్
ఇక కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. ‘ఇలాంటి విమర్శలు చేయడానికి సిగ్గుండాలి. కుటుంబ వ్యవహారాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటారా? అదితి ఏ పార్టీకి చెందినవారన్నది అప్రస్తుతం. తను ఓ మహిళా ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోండి. అది వారి వక్తిగత విషయం. ఇక కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలను పూర్తిగా వదిలేసినట్లుంది' అని యూపీ బీజేపీ సెక్రటరీ చంద్రమోహన్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీపైనే నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన అదితి సింగ్.. రెబల్ గా మారిన విషయం తెలిసిందే.