కోర్టులోనే కుప్పకూలిన న్యాయమూర్తి, మృతి
లక్నో: విధులు నిర్వహిస్తూ కోర్టులో హాలులోనే మరో న్యాయమూర్తి కన్నుమూశారు. ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ జడ్జి గుండెపోటు రావడంతో కోర్టులోనే ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బులంద్ షహర్ పట్టణంలో జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ సింగ్ (52) కోర్టులోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం జిల్లా కోర్టు కార్యాలయంలోని తన ఛాంబర్ లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన ఛాతీనొప్పి, శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయన తన కుర్చీలోనే కుప్పకూలారు.
గమనించిన సిబ్బంది వెంటనే జడ్జిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు చెప్పారు. జిల్లా పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్కు తరలించారు.
మిజోరంలో ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
మిజోరం రాష్ట్రంలో ముగ్గురు తీవ్రవాదులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు తీవ్రవాదులు మణిపూర్కి చెందిన హమర్ పీపుల్స్ కన్వెన్షన్ తీవ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కోలాసిబ్ జిల్లా బిల్ఖావత్లిర్ గ్రామంలో గ్రామస్థుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండగా వీరిని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. వీరికి 12 వేల రూపాయలు నగదు ఇవ్వడానికి వెళ్తున్న మరో ఇద్దరు గ్రామస్థులను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.