ఎస్పీ - కాంగ్రెస్ కూటమి: లక్నోలో హిట్..అమేథిలో ఫట్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూటమి పట్ల రాష్ట్ర రాజధాని లక్నో వాసులు సానుకూలంగా ఉన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూటమి పట్ల రాష్ట్ర రాజధాని లక్నో వాసులు సానుకూలంగా ఉన్నారు. ఎస్పీలో ఆధిపత్య పోరుతో అఖిలేశ్ సమర్థ నాయకుడిగా ఎదిగారని, భవిష్యత్ లో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారని భావిస్తున్నామని ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో తేలింది.
ఆర్ఎస్ఎస్ మద్దతు దారులు కూడా అఖిలేశ్ యాదవ్ కే మద్దతునిస్తుండటం గమనార్హం. బిజెపి హామీలకు, ఆచరణకు చాలా తేడా ఉన్నదని చెప్తున్నారు. కానీ అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఈ రెండు పార్టీలు పరస్పరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఇరు పార్టీల మధ్య మిత్ర భేదం పొడ చూపింది.
అమేథీ, రాయబరేలీ లోక్ సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు ఐదు నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అమేథి, సరేనీ, సలోన్, గౌరిగంజ్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా బయటపెట్టింది. మూడో, నాలుగో దశ పోలింగ్ జరిగే 169 స్థానాల పరిధిలో 15 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు పరస్పరం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లు మాత్రమే కావడంతో ఇరు పార్టీలు పరస్పరం అంగీకారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అమేథీ, రాయబరేలీల్లో ఇలా పోటీలు...
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా నామినేషన్ల పర్వం మొదలు కాలేదు. అమేథి రాజ వంశీయుడు సంజయ్ సింగ్ స్పందిస్తూ తన భార్య అమీతా సింగ్ తప్పక పోటీ చేస్తారని అన్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు. సంజయ్ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ప్రచార కమిటీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అధికార సమాజ్వాదీ పార్టీ కొత్త మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ అమేథి లోక్ సభ స్థాన పరిధిలోని అసెంబ్లీ స్థానాల నుంచి కూడా పోటీ చేయాలని తలపోస్తున్నది. కానీ సమాజ్ వాదీ పార్టీ మాత్రం వెనక్కు తగ్గించేందుకు సిద్ధంగా లేదు. అమేథి నుంచి అధికార సమాజ్ వాదీ పార్టీ తన రాష్ట్ర మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గాయత్రి ప్రజాపతిని తిరిగి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన అమీతా సింగ్పై విజయం సాధించారు. అంతకుముందు అమీతా సింగ్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
అమేథీలోని ఐదు స్థానాల్లో ఇలా..
అమేథితోపాటు మరో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ మధ్య పోటీలు తప్పనిసరి పరిస్థితి కనిపిస్తున్నది. గౌరిగంజ్ స్థానం నుంచి మహ్మద్ నయీం, ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్పై తలపడేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో నయీంపై రాకేశ్ ప్రతాప్ సింగ్ పై 500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నయీం నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ తెలిపారు.
పది స్థానాల్లో ముఖాముఖి...
లక్నో సెంట్రల్ తోపాటు పది స్థానాల పరిధిలో రెండు పార్టీలు ముఖాముఖీ పోటీ పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అఖిలేశ్, రాహుల్ పేరిట ఓట్లు అడుగుతున్నఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గాల్లో మాత్రం వేర్వేరుగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరుపున లక్నో సెంట్రల్ నుంచి పోటీలో ఉన్న మరూఫ్ ఖాన్, రాష్ట్ర మంత్రి రవీదాస్ మల్హోత్రా ఇద్దరూ రాహుల్, అఖిలేశ్ పేరుతోనే ఓట్లడుగుతండటం విచిత్ర పరిస్థితిని తెలియజేస్తున్నది.
యశ్ పాల్ సింగ్ తనయుడిపై వేటు..
లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ద్వేష పూరిత ప్రసంగం చేసిన ఇబ్రహీం మసూద్ సోదరుడు నౌమాన్ మసూద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాంగోహ్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి ఇందర్ సైన్ తప్పుకునేందుకు నిరాకరించడంతో ఆ పార్టీ నాయకత్వం ఆరేళ్ల పాటు ఆయన్ను బహిష్కరించింది. ఇందర్ సైన్ మాజీ ఎంపీ చౌదరి యశ్ పాల్ సింగ్ కుమారుడని సహరాన్ పూర్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు జగ్పాల్ దాస్ గుజ్జర్ చెప్పారు. కానీ బలవంతంగా చర్య తీసుకోవాల్సి వస్తున్నదని చెప్పారు.
వెనక్కి తగ్గని జైస్వాల్ సోదరుడు
కానీ కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ సోదరుడు ప్రమోద్ కుమార్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్యా నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అమితాబ్ బాజ్ పేయికి మద్దతుగా ప్రమోద్ కుమార్ జైస్వాల్ పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉన్నా ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. దీంతో ఈ స్థానం నుంచి రెండు పార్టీలు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
కాంగ్రెసు నేతల మొండివైఖరి
ఇక మహరాజ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి రాజారాం పాల్, ఎస్పీ అభ్యర్థి అరుణ్ తోమర్ పైనా, జైద్ పూర్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పీ ఎల్ పూనియా కొడుకు తనూజ్, సమాజ్ వాదీ పార్టీ నేత రాం గోపాల్ పై పోటీలో ఉన్నారు. బాల్ దేవ్, కోయిల్, పుర్ ఖ్వజి, చాంద్ పూర్, గోవింద్ నగర్, కాన్ఫూర్ కంటోన్మెంట్, భోగ్నిపూర్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు పార్టీల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేత సత్యదేవ్ త్రిపాఠి సైతం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా ఒకటి రెండు రోజుల్లో వివాదం ముగుస్తుందన్నారు.
కూటమి వైపే లక్నో ప్రజలు...
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ - కాంగ్రెస్ పార్టీ కూటమి వైపే లక్నో వాసులు మొగ్గు చూపుతున్నారు. పార్టీలో నాయకత్వ బాధ్యతలు పూర్తిగా కైవసం చేసుకున్న యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. బీఎస్పీ, బీజేపీల కంటే బలమైన నేతగా ఎదిగాడని చెప్తున్నారు. అయిదేళ్ల కాలంలోనే లక్నో - ఆగ్రా ఎక్స్ ప్రెస్ వే, లక్నో మెట్రో రైలు తదితర పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టారని అంటున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళ్లాలన్న మార్గం ఆయనలో కనిపిస్తున్నదని ఓ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
ఆర్ఎస్ఎస్ మద్దతు అఖిలేష్ యాదవ్కే
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతుదారులు సైతం అఖిలేశ్ యాదవ్కే మద్దతు తెలుపుతున్నారు. కమలనాథుల మాటలు, చేతలకు పొంతన లేదంటున్నారు. 2014 ఎన్నికల ముందు వ్యాపార వర్గాలను ఆదుకుంటామని హామీలు గుప్పించిన బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ.. పెద్ద నోట్లను రద్దుచేసి తమ వ్యాపారాలను ఛిన్నాభిన్నం చేశారని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ప్రతి ఎన్నికల సమయంలోనూ రామ మందిర నిర్మాణం అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయంగా వాడుకోవాలని బిజెపి చూస్తున్నదని, కానీ ప్రజలు తెలివి తక్కువ వారు కాదని స్పష్టం చేస్తున్నారు. తాము ఆర్ఎస్ఎస్ వాదిని సీఎంగా కావాలని కోరుకోవడం లేదని స్పష్టంచేస్తున్నారు. హర్యానాలో జరిగిన పరిణామాలను ఇక్కడా జరుగాలని కోరుకోవడం లేదని చెప్పారు.
యువత డిమాండ్ ఇదే...
తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యూపీ యువత కోరుకుంటున్నారు. ప్రత్యేకించి ముస్లిం యువకులు ఇంతకుముందు వెలుగుచూసిన కైరానా వలసలు, దాద్రి దాడులు, ముజఫర్ నగర్ ఘటనలను గుర్తుచేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా లేకపోయినా.. తిరిగి అధికారంలోకి వస్తే అఖిలేశ్ యాదవ్ సరిదిద్దుతారని విశ్లేషకులు చెప్తున్నారు. కొందరు మాత్రం బిజెపి అధికారంలోకి వస్తేనే మహిళలకు భద్రత అని చెప్తుంటే.. దళితుల హక్కుల పరిరక్షణకు బీఎస్పీకి ఓటేయాలని మరి కొందరు అంటున్నారు.