ఎవరా 'గుమ్ నామీ బాబా..?' సుభాష్ చంద్రబోసేనా..? నిగ్గు తేల్చనున్న కమిటీ
లక్నో : "గుమ్ నామీ బాబా.." చాలా ఏళ్లుగా చర్చల్లో నానుతున్న పేరు. ఈ పేరుపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఈ పేరుకు దేశ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు మధ్య కొన్ని ఊహాగానాలు ముడిపడి ఉండడమే.
సుభాష్ చంద్రబోసే గుమ్ నామీ బాబా అన్న మారుపేరుతో 1985 వరకు జీవించారన్న వార్త చాలా ఏళ్లుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇందులో నిజానిజాలేంటో తేల్చడానికి ఇన్నాళ్లకు ఓ కమిటీ ఏర్పాటయింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'గుమ్నామీ బాబా' ఎవరన్నది తేల్చడానికి విష్ణ సహాయ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ ప్రాంతంలో 1985 వరకూ గుమ్ నామీ బాబా అనే పేరుతో ఓ సాధువు ఉండేవారని ఆయనే సుభాష్ చంద్రబోస్ అన్న ప్రచారం అప్పట్లో విస్తృతంగా జరిగింది. ఇదే క్రమంలో 1985లో గుమ్ నామీ బాబా మరణించడం, ఆ తరువాత సుభాష్ చంద్రబోస్ బంధువు లలితాబోస్ మరియు ఫైజాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ విచార్ మంచ్ కోర్టును ఆశ్రయించడం.. గుమ్నామీ బాబా ఎవరో తేల్చాలని కోరడం జరిగాయి.
దీంతో బాబాకు సంబంధించిన కొన్ని వస్తువులను భద్రపరచాల్సిందిగా అప్పట్లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఏర్పాటైన దర్యాప్తు కమిషన్ లక్నో కేంద్రంగా పనిచేస్తుందని, ఫైజాబాద్లోనూ దీనికో కార్యాలయం ఉందని, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను మేరకే ఈ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశామని యూపీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా ఇప్పటికే వెలువరించినట్టుగా చెప్పపుకొచ్చారు.