బీజేపీ, ఎస్పీలకు ట్రిపుల్ తలాఖ్ ఇవ్వండి: యోగి, అఖిలేష్ సోదరులంటూ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలపై ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జలౌన్ జిల్లాలోని మధోగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన ఎన్నికల సభలో ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)పై విమర్శలు గుప్పించారు.

విడిపోయిన సోదరలంటూ యోగి, అఖిలేష్పై ఒవైసీ సెటైర్లు
బీజేపీ, ఎస్పీలను సమం చేస్తూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్లను 'విడిపోయిన సోదరులు'గా అభివర్ణించారు ఒవైసీ. ఇద్దరూ తమను తాము "చక్రవర్తులుగా భావించుకుంటారే తప్ప నాయకులు కాదు" అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఎస్పీ, బీజేపీ ఒకే నాణానికి రెండు వైపులని, యోగి-అఖిలేష్ విడిపోయిన అన్నదమ్ములని అనిపిస్తోంది. ఇద్దరి మనస్తత్వం ఒకటే.. ఇద్దరూ క్రూరత్వం, అహంకారి.. తమను తాము నాయకులుగా భావించరు. చక్రవర్తులుగానే భావిస్తారు" అని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

బీజేపీ, ఎస్పీలకు ట్రిపుల్ తలాఖ్ ఇవ్వాలటూ ఒవైసీ పిలుపు
"మోడీ ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడతారు. కానీ ఈసారి, ప్రజలు బీజేపీ, ఎస్పీ రెండింటికీ తలాక్, తలాక్, తలాక్ చెప్పాలి. వారి కథ (ఉత్తరప్రదేశ్లో) ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తనను తాను వజీర్(ప్రధాని)గా భావిస్తారు. ఢిల్లీలో కూర్చున్న సుల్తాన్ (రాజు) రాజకీయాల్లో చక్రవర్తిగా మారిన వ్యక్తిని తొలగించాలి' అని ఒవైసీ పిలుపునిచ్చారు.

అఖిలేష్, యోగిని ఇంటికి పంపాలి: ఒవైసీ
ఒకరిని (అఖిలేష్ యాదవ్) సైఫాయికి పంపాలి, మరొకరిని గోరఖ్పూర్కు పంపాలి, దళితులు, వెనుకబడినవారు, మైనారిటీలు, పేదలను ఇంట్లో కూర్చోబెడితేనే వారికి ప్రయోజనం చేకూరుతుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం తెలియజేసింది. ఇప్పటికే యూపీలో రెండు దశల ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో రెండవ నుంచి ఆరవ రౌండ్ల పోలింగ్ వరుసగా ఫిబ్రవరి 14, 20, 23, 27, మార్చి 3 తేదీల్లో జరగాల్సి ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications