మైనర్పై అత్యాచారయత్నం: చెప్పుల దండతో ఊరేగింపు
లక్నో: మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఊరంతా తిప్పుతూ నిందితుడికి బుద్దిచెప్పారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
మైనర్ బాలికపై కన్నేసిన ఓ మానవ మృగానికి అక్కడి స్థానికులు బడితెపూజ చేశారు. చితకబాది చెప్పుల దండతో ఊరంతా ఊరేగిస్తూ 'సన్మానం' చేశారు.
ఉత్తర ప్రదేశ్లోని హార్దోయ్ జిల్లాలో జరిగిందీ సంఘటన. పోలీసుల కథనం ప్రకారం... ఓ బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా నిందితుడు బాలభద్ర అలియాస్ మస్తానా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లి గమనించింది. వెంటనే ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకొన్నారు. నిందితుడిని పట్టుకొని చితకబాదారు. చెప్పుల దండ వేసి గ్రామం మొత్తం తిప్పారు.
నిందితుడిని తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు హార్దోయ్ ఎస్పీ విపిన్ కుమార్ మిశ్రా వెల్లడించారు.