పుతిన్ ప్లాన్ ఏంటీ: మళ్లీ భారత్-చైనా చేతులు కలిపేలా: శతృవు ఇంటి గడప తొక్కేలా మోడీపై ఒత్తిడి
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి సాగిస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. భారత్-చైనా సైన్యాధికారులు ఇప్పటికే పలుమార్లు చర్చలు నిర్వహించినప్పటికీ కొలిక్కి రావట్లేదు. ఏదో ఒక అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడుతోంది. వాస్తవాధీన రేఖ వివాదంపై కమాండర్ ర్యాంక్ స్థాయి అధికారులు ఇటీవలే నిర్వహించిన చర్చలు కూడా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
ఆ ఉద్రిక్తతకు..
లఢక్ సెక్టార్ సమీపంలో గాల్వన్ వ్యాలీ, పాంగ్యాంగ్ లో భారత్-చైనా సైనికుల మధ్య 2020 జూన్లో చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటూ వచ్చింది. అంతకుముందు నుంచే అంటే- అదే ఏడాది మేలో భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భద్రత సిబ్బంది మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైన్యాన్ని.. జవాన్లు విజయవంతంగా అడ్డుకున్నారు.
వాంగ్ యీ పర్యటన వెనుక పరామర్థం
ఈ పరిణామాల మధ్య చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. మూడు గంటల పాటు వారి మధ్య చర్చలు సాగాయి. వాస్తవాధీన రేఖ వివాదం చెలరేగిన తరువాత చైనాకు చెందిన ఓ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
యుద్ధం వేళ..
ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న వేళ.. వాంగ్ యీ భారత పర్యటనకు రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. రష్యాతో అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలు.. భారత్-చైనా. భారత్-చైనా మధ్య ఏ స్థాయిలో విభేదాలు, ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అలాంటి సందర్భంలో చైనా ఒక మెట్టు కిందికి దిగి- భారత పర్యటనకు రావడం వెనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
బ్రిక్స్ భేటీకి..
బ్రిక్స్ తదుపరి భేటీ చైనా రాజధాని బీజింగ్లో ఏర్పాటు కానుంది. రష్యా, భారత్, చైనాతో పాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు ఇందులో సభ్యత్వం ఉంది. బీజింగ్లో ఏర్పాటు కాబోయే ఈ బ్రిక్స్ అత్యున్నత స్థాయి సమావేశానికి భారత్ దూరంగా ఉండొచ్చంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. చైనాతో ఉన్న విభేదాల కారణంగా భారత్- బ్రిక్స్ భేటీలో పాల్గొనడానికి బీజింగ్కు వెళ్లకపోవచ్చనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక వెళ్లక తప్పనట్టే..
స్వయానా చైనా ఓ మెట్టు దిగిన ప్రస్తుత పరిస్థితుల్లో- దానికి అనుగుణంగా భారత్ కూడా స్పందించక తప్పదు. ఫలితంగా బ్రిక్స్ భేటీకి హాజరయ్యే విషయంలో భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా.. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్.. చైనా గడప తొక్కేలా వ్లాదిమిర్ పుతిన్.. ప్లాన్ వేశారని అంటున్నారు. ఇలా రాకపోకలు మొదలైతే.. ఈ రెండు దేశాల మధ్య విభేదాల తీవ్రత తగ్గుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.