కట్జు సంచలన వ్యాఖ్యలు: పార్లమెంటులో తీవ్ర రభస
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ప్రకటించిన అవినీతి న్యాయమూర్తి కథనంపై సోమవారం పార్లమెంట్లో గందరగోళం చెలరేగింది. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఆ జడ్జిగా ఎదిగిన క్రమం గురించి కట్జూ వెల్లడించిన కథనంపై అన్నాడిఎంకే ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ గొడవ చేశారు. దీంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది.
మొదటిసారిగా రాజ్యసభ 10 నిముషాలపాటు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభలో కార్యక్రమాలకు సభ్యులు అంతరాయం కలిగించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎంత సర్ది చెప్పినా సభ్యులు వినిపించుకోలేదు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో ఛైర్మన్ హమీద్ అన్సారి రెండోసారి సభను వాయిదా వేశారు. లోక్సభలో కూడా అన్నాడిఎంకే ఎంపీలు రగడ సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకోవడంతో రగడ సద్దుమణిగింది.
ఓ న్యాయమూర్తి నియామకంపై కొద్ది రోజుల క్రితం చెలరేగిన వివాదం నేపథ్యంలో వ్యవహారాన్ని సుప్రీంకోర్టు రైటైర్డ్ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ స్వయంగా బయటపెట్టారు. అవినీతిపరుడైన ఒక జిల్లా న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా ఎలా ఎదిగింది ఆయన వివరించారు. ప్రస్తుతం మార్కండేయ కట్జూ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్గా ఉన్నారు.
న్యాయమూర్తుల నియామకాలపై ఒక సంచలన వ్యవహారాన్ని ఆయన బయటపెట్టారు. న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ జోక్యం ఎంత బలంగా పాతుకుపోయిందో వివరించి చెప్పారు. తమిళనాడులో ఒక జిల్లా జడ్జి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎలా నియామకం పొందింది ఆయన వివరించారు. ఇందులో న్యాయమూర్తి పేరుగానీ, ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీ పేరుగానీ కట్జూ వెల్లడించలేదు.
ఈ వ్యవహారం యూపీఏ హాయాంలో జరిగింది. యూపీఏలో భాగస్వామ్యమైన డీఎంకే పార్టీ అవినీతి న్యాయమూర్తికి అండగా నిలిచిందని కట్జూ ఆరోపించారు.